ఎన్నిక‌ల మూడ్‌లోకి ఏపీ..

సార్వ‌త్రిక స‌మ‌రానికి దాదాపు ఏడాదిన్న‌ర ముందే ఏపీ దాదాపు ఎన్నిక‌ల మూడ్‌లోకి వెళ్లిపోయిన‌ట్టే క‌నిపిస్తోంది. ప్ర‌ధాన పార్టీలు అన్నీ కూడా దాదాపు ప్ర‌చారం ప్రారంభించాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అధికార పార్టీ వైసీపీ నుంచి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వ‌ర‌కు.. మ‌రో పార్టీ జ‌న‌సేన వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. గెలుపు గుర్రం ఎక్క‌డం కోసం టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌లు ప్ర‌య‌త్నాలు ప్రారంభించాయి.

అయితే.. ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు నిలుస్తారు? అనేది ప‌క్క‌న పెడితే..వ్యూహాత్మ‌కంగా ఎన్నిక‌ల‌కు దిగుతుండ‌డం ఆస‌క్తిగా మారింది. అస్త్ర శ‌స్త్ర‌ల‌తో అధికార పార్టీ ప్ర‌జ‌ల‌కు చేరువయ్యేందుకుమ‌రోసారి విజ‌యం ద‌క్కించుకునేందుకు.. ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఇక‌, టీడీపీ ఇప్ప‌టికే ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక‌త‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.

టీడీపీ అదినేత చంద్ర‌బాబు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్తున్నారు. త‌మ్ముళ్ల‌ను క‌దిలిస్తున్నారు. మ‌రి కొన్ని రోజుల్లో పార్టీ యువ నాయ‌కుడు పాద‌యాత్ర ప్రారంభించ‌నున్నారు. ఇక‌, చంద్ర‌బాబు సైతం.. బ‌స్సు యాత్ర చేస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఇలా ఏవిధంగా చూసినా.. వైసీపీకి స‌మానంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం దూకుడు పెంచ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, మ‌రోపార్టీ జ‌న‌సేన కూడా వారాహితో వాగ్ధాటి వినిపించి.. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.

ఇత‌ర పార్టీల హ‌డావుడి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఎన్నిక‌ల‌కు ఏడాదిన్నర ఉంద‌న‌గానే.. ఇలా ప్ర‌ధాన పార్టీలు ఎన్నిక‌ల మూడ్‌లోకి రాష్ట్రాన్ని తీసుకువెళ్లిపోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. వాస్త‌వానికి.. వ‌చ్చే ఏడాది అంటూ.. మ‌రో నాలుగు నెల్ల‌లో దేశంలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఉన్నాయి. కీల‌క‌మైన క‌ర్ణాట‌క కూడా ఈ జాబితాలోనే ఉంది. అయిన‌ప్ప‌టికీ ఎలాంటి హ‌డావుడీ అప్పుడే క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కానీ, ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా రాజ‌కీయం వేడెక్క‌డం.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.