డామిట్, కథ అడ్డం తిరిగింది : ‘వారాహి’ రంగు మారక తప్పదా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌జ‌ల్లోకి వెళ్లి పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసుకునేందుకు భారీ వాహ‌నం రెడీ చేసుకున్న విష‌యం తెలిసిందే. దీనికి వారాహి(అమ్మ‌వారి పేరు) అనేపేరును కూడా ఆయన పెట్టుకున్నారు. దీనికి సంబంధించి గ‌త వారం విడుద‌ల చేసిన ట్విట్ట‌ర్ వీడియో సోష‌ల్ మీడియాలో దుమ్మురేపింది. ఇద్ద‌రు స‌ర్దార్జీలు కుడి ఎడ‌మ‌లు న‌డిచి రాగా.. మ‌ధ్య ఠీవీగా వారాహి వాహ‌నం దూసుకువ‌స్తున్న వీడియో.. పార్టీ అభిమానుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను మంత్రుముగ్ధుల ను చేసింది.

అయితే, దీనిపై రాజ‌కీయ దుమారం కూడా అంతే రేంజ్లో రేగింది. వైసీపీ మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత పేర్ని నాని వారాహిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆలివ్ క‌ల‌ర్‌లో వాహ‌నాన్ని ఎలా రిజిస్ట్రేష‌న్ చేస్తార‌ని..కేవ‌లం సైనికుల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన రంగునుఎలా వేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇది రిజిస్ట్రేష‌న్ చ‌ట్టానికి వ్య‌తిరేక‌మ‌ని కూడా చెప్పారు. ప‌వ‌న్ ల‌క్ష పుస్తకాలు చ‌దివాడుక‌దా.. మ‌రో పుస్త‌కం.. వెహిక‌ల్‌ రిజిస్ట్రేష‌న్ యాక్ట్‌ను కూడాచ‌దువుకోవాలంటూ చుర‌క‌లు అంటించారు.

ఇక‌, షెడ్యూల్ ప్రకారం ఈ వాహనానికి హైద‌రాబాద్‌లో రిజిస్ట్రేష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి.. అక్క‌డే కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేయించి ఏపీలోకి తీసుకురావాల‌ని.. దీనికి అట్ట‌హాసంగా సంబ‌రాలు కూడా చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే, ఇది పేర్ని నాని చెప్పిన‌ట్టుగా రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ స‌మ‌యంలోనే ఇబ్బందులు ఎదుర్కొంది. లారీ ఛాసిస్‌ను బస్సుగా మార్చడంపై అభ్యంత‌రాలు తెలిపిన‌ట్టు స‌మాచారం. ఇది చూసేందుకు కూడా అలానే ఉండ‌డం గ‌మ‌నార్హం.

అదేవిధంగా ప్ర‌చార వాహ‌నం బస్సు అని చెప్పినప్పుడు బస్సుకు ఉండాల్సిన హైట్ ఉండాల‌ని, కానీ, ఇది అంత‌కుమించిన హైట్(ఎత్తు) ఉంద‌ని అభ్యంత‌రం తెలిపిన‌ట్టు తెలిసింది. ఇక‌, వారాహి వాహ‌నానికి వినియోగించిన చ‌క్రాలు కూడా..గ‌నుల్లో వాడే టిప్ప‌ర్లకు ఉండే టైర్ల‌ను వినియోగించ‌డంపైనా అధికారులు అభ్యంత‌రం తెలిపారని స‌మాచారం. ఇలాంటి టైర్లు వినియోగించ‌డం.. సాధార‌ణ రోడ్ల‌పై సాధ్యం కాదు.

ఇక‌, ఆర్మీకి సంబందించిన వాహ‌నాల‌కు వినియోగించే ఆలివ్ గ్రీన్‌ కలర్ ను సివిల్ వాహనానికి ఉపయోగిస్తారనేది కూడా ప్ర‌ధాన అభ్యంత‌రంగా క‌నిపించింది. ఇవ‌న్నీ మార్చుకుని వస్తేనే రిజిస్ట్రేషన్ చేయగలమ‌ని చెప్పడంతో వారాహి రిజిస్ట్రేషన్ వాయిదా ప‌డింద‌ని తెలిసింది. మొత్తానికి ఈ ప‌రిణామాన్ని ముందే ఊహించారో.. లేదో.. కానీ, ఇప్పుడు మాత్రం మార్పులు త‌ప్ప‌వు. దీనివెనుక ఏ రాజ‌కీయ‌కుట్ర కూడా లేదు. కేవ‌లం నిబంధ‌న‌లు, చ‌ట్టం మాత్ర‌మే ఉండ‌డం విశేషం.