స‌జ్జ‌ల‌కు ష‌ర్మిల వార్నింగ్!

వైసీపీ ముఖ్య నాయ‌కుడు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల వార్నింగ్ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల‌ను క‌లిపి ఉంచాల‌న్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని వ్యాఖ్యానించిన‌ స‌జ్జ‌ల‌పై ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సజ్జల చేసిన‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. “ఆయ‌న ఏ మూడ్‌లో ఉండి మాట్లాడారో కానీ, స‌జ్జ‌ల చేసిన వ్యాఖ్య‌లు అర్థం లేనివి” అని ష‌ర్మిల అన్నారు.

అంతేకాదు, తెలంగాణ ఏర్పాటు, రాష్ట్రం అనేది ఒక వాస్త‌వ‌మ‌ని షర్మిల తెలిపారు. ఎంతో మంద బలిదానాలు, ఎంతో మంది త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలవడం అసాధ్యమ‌ని అన్నారు. ఇప్పుడు కొత్త‌గా స‌జ్జ‌ల ఏమీ తెలియ‌న‌ట్టుగా మాట్లాడ‌డం స‌రికాద‌న్నారు.

“కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయి. ఒక సారి విభ‌జించిన రాష్ట్రాలను ఎలా క‌లుపుతారు?” అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా అదిరిపోయే కామెంట్ చేశారు ష‌ర్మిల‌.. “మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదు, మీ ప్రాంత అభివృద్ధి మీద. మీ హక్కుల కోసం పోరాటం చేయండి. మీ ప్రాంతానికి న్యాయం చేయండి” అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం త‌గ‌ద‌ని గ‌ట్టిగానే ష‌ర్మిల హెచ్చ‌రించారు. నిజానికి తెలంగాణ‌లో అధికార పార్టీ నాయ‌కులు ఇంకా స్పందించేలోపునే ష‌ర్మిల చేసిన ఈ హెచ్చ‌రిక‌లు వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, స‌జ్జ‌ల చేసిన వ్యాఖ్య‌ల‌పై టీఆర్ ఎస్ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.