అందుకే బాబు పాన్ ఇండియా..

దిల్లీ జీ20 సన్నాహక సమావేశం లక్ష్యం ఏదైనా కానీ తెలుగు రాష్ట్రాల రాజకీయ తక్కెళ్లకు మాత్రం మాంచి పని దొరికింది. మరీ ముఖ్యంగా తెలుగు సినిమా స్టైల్లోనే పాన్ ఇండియా రేంజ్‌లు, పోలికలు మొదలయ్యాయి. పాన్ ఇండియా పొలిటీషియన్ ఎవరనేదీ చర్చ జరుగుతోంది.

గతంలోనూ అనేకసార్లు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య ఇలాంటి చర్చ జరిగినా ఇప్పుడు మాత్రం వేరే లెవల్లో జరుగుతోంది. మరీ ముఖ్యంగా జీ20 సన్నాహక సమావేశాల కారణంగా జగన్, చంద్రబాబు ఇద్దరూ ఒకేసారి ఢిల్లీ వెళ్లడంతో ఇది ఎక్కువైంది. మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫొటోలు ఈ చర్చలకు కేంద్రమవుతున్నాయి.

సమావేశంలో పాల్గొన్న ఫొటోతో పాటు మోదీతో జగన్ ఉన్న ఫొటో ఒకటి కనిపిస్తుండగా చంద్రబాబు ఫొటోలు మాత్రం దేశంలోని జాతీయ స్థాయి నేతలు, ముఖ్యమంత్రులు, ప్రధాన పార్టీల నేతలు, కీలక నేతలతో కనిపిస్తున్నాయి. దీంతో సహజంగానే టీడీపీ నాయకులు, కార్యకర్తలు మా చంద్రబాబంటే అట్లుంటది అంటూ కాస్త ఎక్కువ గర్వపడుతున్నారు. చంద్రబాబు సీనియారిటీ, చొరవ, ఆయనపై ఉన్న ఒక పాజిటివ్ ఇమేజ్ వంటివన్నీ దేశంలోని అందరు నేతలతో ఆయన పరిచయానికి, పలకరింపులకు, మాటామాంతీకి కారణమైనప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో మాత్రం ఒక ఊపు తెచ్చిందనే చెప్పాలి.

మోదీతో చంద్రబాబు 10 నిమిషాలకు పైగా మాట్లాడడం… ఆ తరువాత అమిత్ షా, జేపీ నడ్డా, పీయూష్ గోయల్, జయశంకర్, అజిత్ ఢోబల్ వంటివారూ చంద్రబాబుతో మాట్లాడడం వంటివన్నీ ఆయన ప్రాధాన్యాన్ని చాటుతున్నాయి. ఇక విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సీఎంలు మమత బెనర్జీ, నవీన్ పట్నాయక్, స్టాలిన్, సీపీఎం నేత సీతారాం ఏచూరి వంటి సీనియర్లూ చంద్రబాబును చూడగానే వచ్చి చేతులు కలిపి ముచ్చట్లు పెట్టారు.

ఇక వివిధ రాష్ట్రాలకు చెందిన కొత్త తరం నేతలు కూడా చంద్రబాబును కలిసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తి చూపడం ఈ సమావేశాల్లో కనిపించింది.
ఇందుకు సంబంధించిన ఫొటోలన్నీ ఆయా నేతల సోషల్ మీడియా పేజీల్లో కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ శిబిరాలలో కాస్త ఈ విషయంలో నిరుత్సాహం కనిపిస్తోంది. జగన్ కూడా చంద్రబాబు ఉన్నందునో ఏమో ఈ సమావేశాల నుంచి వేగంగానే బయటపడి ఆంధ్ర చేరుకున్నారు.

ఇక టీఆర్ఎస్ నేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశాలకు డుమ్మా కొట్టారు.