ఎన్నిక‌ల వేళ.. మోడీ విన్యాసాలు

అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌లు. గుజ‌రాత్ పీఠం ఎవ‌రిదో తేల్చేసే పోలింగ్ జ‌రుగుతున్న వేళ‌… ప్ర‌ధాని మోడీ చేసిన విన్యాసం అనేక విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. గుజ‌రాత్ రెండో ద‌శ‌లో 93 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఈ రోజు ఉద‌యం పోలింగ్‌ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. మొత్తం గుజ‌రాత్ అదికారాన్ని ప్ర‌జ‌లు ఎవ‌రికి, ఏ పార్టీకి ద‌క్కించాలో ఈ ఎన్నిక‌ల్లోనే తేలిపోనుంది.

అయితే, ఈ ఎన్నిక‌ల్లో మ‌రో కీల‌క విష‌యం ఏంటంటే.. ప‌ట‌ల్ వ‌ర్గానికి చెందిన బ‌ల‌మైన ప్ర‌భావం చూపించే 52 నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌డం. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ ప‌రిస్థితి అంత బ‌లంగా అయితే లేదు. క‌ట్ చేస్తే.. ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంటే త‌ప్ప‌.. గెలుపు గుర్రం ఎక్క‌లేమ‌నుకున్న ప్ర‌ధాని మోడీ విన్యాసాలు ప్రారంభించారు.

ఇక్క‌డి అహ్మ‌దాబాద్ జిల్లాలోని స‌బ‌ర్మ‌తి ప్రాంతంలో ఉన్న ఓ స్కూల్‌లో ఓటు వేసేందుకు వ‌చ్చారు. ఆయ‌న రావ‌డాన్నిఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌రు. కానీ, ఈ స‌మ‌యంలో ఆయ‌న చేసిన విన్యాసాలనే ప్ర‌జాస్వామ్య వాదులు త‌ప్పుబ‌డుతున్నారు.

1) మోడీ నేరుగా పోలింగ్ కేంద్రానికి వ‌చ్చేందుకు పోలీసులు గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేశారు. కానీ, ఆయ‌న మాత్రం త‌న కాన్వాయ్‌ను కిలో మీట‌రు దూరంలోనే నిలిపివేశారు. అక్క‌డి నుంచి న‌డుచుకుంటూ పోలింగ్ కేంద్రానికి వ‌చ్చారు.

2) ఇలా న‌డుస్తూ.. వ‌చ్చే స‌మ‌యంలో ఆయ‌న రెండు చేతులూ ఊపుతూ.. ప్ర‌జ‌ల‌కు అభివాదం(కానీ, ప్ర‌చారం అంటున్నారు మేధావులు) చేస్తూ ముందుకు సాగారు. చిరున‌వ్వులు చిందించారు.

3) సామాన్య ఓట‌రు మాదిరిగా మోడీ క్యూలో నిల‌బ‌డ్డారు. ఇది కూడా త‌ప్పుకాద‌ని అనొచ్చు. కానీ, వీఐపీల‌కు ప్ర‌త్యేకంగా పింక్ బూత్‌ను ఏర్పాటు చేసింది ఎన్నిక‌ల సంఘం. అయితే, దానిని వినియోగించుకోకుండా.. సాధార‌ణ పౌరులు ఉన్న లైన్‌లో నిల‌బ‌డి మోడీ ఓటేశారు. ఇది కూడా ఎన్నిక‌ల‌ను, ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేయ‌డ‌మే అవుతుంది.

4) ఓటు వేసి బ‌య‌ట‌కు రాగానే.. గుమ్మంలోకి అధికారులు పెద్ద కారును తీసుకువ‌చ్చారు. కానీ, మోడీ ఎక్కకుండా.. త‌న ఎడ‌మ చేతి చూపుడు వేలుపై ఉన్న ఓట‌రు ఇంకు మార్కును ప్ర‌ద‌ర్శిస్తూ.. అహ్మ‌దాబాద్ వీధుల్లో సుమారు కిలో మీట‌రుపైనే సంచ‌రించారు. క‌నిపించిన ప్ర‌తి ఒక్క‌రినీ ప‌ల‌క‌రించారు. కేవ‌లం ఆయ‌న మెడ‌లో కండువా మాత్ర‌మే లేదు. మ‌రి ఇవ‌న్నీ.. విన్యాసాలుకావా? ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచేయాల‌నేందుకు దొడ్డిదారులు కావా! అనేది మేధావుల ప్ర‌శ్న‌.