మీడియా కవరేజీ సరే.. ఓట్లు పడతాయా?

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిళ పేరు బాగా వినిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మీడియాలో ఆమెకు కవరేజీ కూడా బాగా వస్తోంది. నెలల తరబడి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నా పెద్దగా పట్టించుకోని మీడియా.. గత కొన్ని రోజుల నుంచి ఆమె మీద బాగానే ఫోకస్ పెడుతోంది.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతల మీద షర్మిళ ఇటీవల కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం.. ఇందుకు ప్రతిగా పాదయాత్రలో ఆమె మీద దాడి జరగడం.. తర్వాత ఆమె దాడికి గురైన కారు తీసుకుని హైదరాబాద్‌లో ప్రగతి భవన్ వైపు దూసుకెళ్లడం.. పోలీసులు ఆమె కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడం.. ఈ పరిణామాలతో షర్మిళ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్ తనయురాలు అనుకున్నంత ఆషామాషీగా ఏమీ లేదని.. ఆమె విషయంలో మిగతా రాజకీయ పార్టీలు జాగ్రత్తగా ఉండాల్సిందే అనే చర్చ నడుస్తోంది.

ఐతే ఇంతకుముందు పట్టించుకోని మీడియా వాళ్లు ఆమెకు ఇప్పుడు బాగానే ప్రయారిటీ ఇస్తుండొచ్చు. రాజకీయ వర్గాల్లో కూడా గత కొన్ని రోజుల పరిణామాల గురించి చర్చ జరుగుతుండొచ్చు. కానీ జనం షర్మిళను ఏ కోణంలో చూస్తున్నారు.. ఆమెను రాజకీయంగా ఆదరిస్తారా.. ఎన్నికల్లో తనను, ఆమె పార్టీని నమ్మి ఓట్లు వేస్తారా అన్నదే ప్రశ్నార్థకం. తెలంగాణలో షర్మిళ పార్టీ పెట్టడం.. పాదయాత్ర చేయడంపై మొదట్నుంచి జనాలకు రకరకాల సందేహాలున్నాయి. అన్న మోసం చేస్తే ఏపీలో తేల్చుకోకుండా తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టడం.. పోరాటం చేయడం ఏంటి అనే ప్రాథమిక ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పే పరిస్తితి లేదు.

ఇదంతా ఒక డ్రామాలాగే చూస్తున్నారు జనం మొదట్నుంచి. షర్మిళ ఏం చేసినా, ఏం మాట్లాడినా అందులో ఒక నాటకీయత కనిపిస్తోందే తప్ప.. సహజంగా అనిపించట్లేదు. గతంలో జగన్ సైతం ఇలా నాటకీయంగా చాలా చేశాడు. కానీ ఏపీలో ఆయనకు, ఆయన పార్టీకి బలం ఉంది కాబట్టి ఏం చేసినా చెల్లిపోయింది. కానీ తనకు బేస్ లేని చోట షర్మిళ పార్టీ పెట్టి జగన్ తరహా రాజకీయాలే చేస్తుంటే.. చాలా డ్రమటిగ్గా అనిపిస్తోంది. పైగా ఓట్లు చీల్చి తనకు లాభం చేకూరేలా షర్మిళను కేసీఆరే రంగంలోకి దించి డ్రామా నడిపిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొంచెం సెన్సేషనల్‌గా అనిపించడం వల్ల గత కొన్ని రోజుల పరిణామాలపై మీడియాలో కవరేజీ అయితే బాగా వచ్చి ఉండొచ్చు కానీ.. షర్మిళకు తెలంగాణలో ఓట్లు పడతాయన్న గ్యారెంటీ మాత్రం కనిపించడం లేదన్నది రాజకీయ విశ్లేషకుల మాట.