ష‌ర్మిల మ‌ళ్లీ అరెస్టు.. ఈ సారి కారుతో స‌హా!

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల హ‌ల్చ‌ల్ ఏమాత్రం ఆగ‌డం లేదు. తాజ‌గా మ‌రోసారి ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ సారి ఆమెను కారుతో పాటు టోయింగ్‌(వాహ‌నాల‌ను తీసుకువెళ్లే క్రెయిన్‌) వాహ‌నంతో స్టేష‌న్‌కు త‌ర‌లించారు. దీంతో ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఏం జ‌రిగింది?

తెలంగాణ పోలీసులు సోమ‌వారం సాయంత్రం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద షర్మిలను అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. పాద‌యాత్ర‌లో ఉన్న ఆమెను అరెస్టు చేయ‌డంతో పాటు.. వెంట‌నే ప్ర‌త్యేక వాహ‌నం ఏర్పాటు చేసి.. హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. అనంత‌రం.. ఎలాంటి కేసులు పెట్ట‌కుండానే ఆమెను ఇంటి వ‌ద్ద వ‌దిలేశారు. అయితే.. దీనిని నిర‌సిస్తూ.. ఆమె పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగడం..పోలీసులు లాఠీ ఛార్జ్ చేయ‌డం తెలిసిందే.

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేప‌థ్యంలోనే ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ష‌ర్మిల మాత్రం త‌న‌ను అక్ర‌మంగా అరెస్టు చేశార‌ని వ్యాఖ్యానించారు. ‘‘మా పాదయాత్రకు అనుమతి ఉంది. బస్సును దగ్ధం చేసినవారిని అరెస్ట్‌ చేయకుండా.. మమ్మల్ని ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారు’’ అని షర్మిల మండిపడ్డారు. కాగా, మంగ‌ళ‌వారం ఉద‌యం ఇదే అంశంపై సీఎం కేసీఆర్‌ను నిల‌దీస్తానంటూ.. లోట‌స్ పాండ్ నుంచి ప్ర‌గ‌తి భ‌వ‌న్ వైపు వెళ్లారు.

ఈ క్ర‌మంలో కారును స్వ‌యంగా ఆమే న‌డుపుతూ.. బ‌య‌లు దేశారు. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసు లు వెంట‌నే రంగంలోకి దిగి.. ఆమెను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, ఆమె మాత్రం పోలీసులకు ఎలాంటి స‌మాధానం చెప్ప‌కుండా.. ప‌గిలిన అద్దాలున్న కారులోనే నిర‌స‌న వ్య‌క్తం చేసేందుకు వెళ్తున్నాన‌ని.. త‌న అనుచ‌రుల‌తో చెప్పించారు. దీంతో చాలా సేపు ఆమె బ్ర‌తిమాలిన పోలీసులు.. ఎట్ట‌కేల‌కు.. టోయింగ్ వాహ‌నాన్ని రంగంలోకి దింపి.. ఆమెను అక్క‌డ నుంచి ఎస్సార్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో మీడియాకు క‌బురు పెట్టిన ష‌ర్మిల అనుచ‌రులు.. దీనిని వీడియోలు తీయించి సోష‌ల్ మీడియాలో పెట్ట‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి.

ష‌ర్మిల వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు ఇవే..

నర్సంపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయ‌కుడు పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుదర్శన్‌రెడ్డి ఆయన భార్య సైతం ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతూ డబ్బులు దండుకుంటున్నారని షర్మిల ఆరోపించారు. నర్సంపేట ఎమ్మెల్యే పేరుకే పెద్ది సుదర్శన్‌రెడ్డి అని, మనిషిది చిన్న బుద్ధి అని అన్నారు. ఉద్యమకారుడిగా ఉండి.. ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశార‌ని అన్నారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు కబ్జాకోరయ్యాడని ధ్వజమెత్తారు.

ఎమ్మెల్యే అనుచరుల కన్నుపడితే భూమి మాయమవుతుందన్నారు. చివరికి లే ఔట్ల్‌లో గ్రీన్‌ల్యాండ్స్‌ను వదలడం లేదని పేర్కొన్నారు. ఆయనకు సంపాదన తప్ప మరో ధ్యాసలేదని, ఇలాంటి వారికి ఎందుకు ఓట్లు వేయాలని, కర్రుకాల్చి వాతపెట్టాలని త‌న పాద‌యాత్ర‌లో ష‌ర్మిల ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలోనే తీవ్ర అల‌జ‌డి చోటు చేసుకుంది.