ఆ మంత్రికి టికెట్ ఇవ్వొద్దు.. వైసీపీలో ముస‌లం

ఏపీలో ఎన్నిక‌ల‌కు ఏడాదిన్నర స‌మ‌యం ఉండ‌గానే అధికార పార్టీలో అస‌మ్మ‌తి రాజుకుంది. సిట్టింగు ఎమ్మెల్యేల ప‌రిస్థితి ఎలా ఉన్నా.. మంత్రుల విష‌యంలో ప‌లు చోట్ల వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తాజాగా శ్రీకాకులం జిల్లా ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే క‌మ్ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుపై వైసీపీ నేత‌లు విరుచుకుప‌డ్డారు. రానున్న ఎన్నికల్లో అప్పలరాజుకు టికెట్ ప్రకటిస్తే తప్పకుండా ఓడిస్తామని అసమ్మతి నాయకులు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం దున్నూరు తీర ప్రాంతంలోని వనభోజన మహోత్సవంలో పలువురు వైసీపీ అసమ్మతి నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైసీపీ జిల్లా కార్యదర్శి దువ్వాడ హేమబాబు చౌదరి మాట్లాడుతూ.. ‘మీము వైసీపీ నేతలం. సీదిరిపై అసమ్మతి నాయకులం మాత్రమే. పలాస నియోజకవర్గంలో మంత్రి అండదండలతో జరుగుతున్న దోపిడీని, దౌర్జన్యాలను సీఎం జగ‌న్ దృష్టికి పూర్తి ఆధారాలతో తీసుకెళ్తాం. నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లుగా ఉన్న‌ అగ్నికుల క్షత్రియ, యాదవ, కాళింగ సామాజిక వర్గాల నుంచి అభ్యర్థిని ప్రకటించాలని కోరుతాం. దీన్ని పూర్తిస్థాయి ఓటర్ల జాబితాతో సహా అన్ని వివరాలతో సీఎం దృష్టికి తీ సుకెళ్తాం“ అన్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అభ్యర్థిని మార్చకపోతే పలాసలో వైసీపీ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చ‌రించారు. పార్టీ ప్రతిష్ట దిగజారి, మనుగుడ కోల్పోతామ‌న్నారు. పంచాయతీ ఎన్నికల నాటి నుంచి ప్రతి గ్రామంలో వైసీపీలోనే రెండువర్గాలుగా విడగొట్టి శకుని రాజకీయాలకు పాల్పడుతున్నారు. కొంతమంది ద్వితీయశ్రేణి నాయకులతో దోపిడీలు, అక్రమాలు చేయిస్తూ తమకేమీ తెలియనట్లుగా మంత్రి వ్యవహరిస్తున్నారు. దీన్ని నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న ఎన్ని కల్లో సీదిరి అభ్యర్థిగా పోటీచేస్తే వైసీపీ నుంచి 175 స్థానాలకు గాను 174 స్థానాలే లెక్కించాలి. ఈ జాబితా నుంచి పలాసను తీసివేయాలి అని నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

పార్టీ కష్టాల్లో ఉన్న సమయంతోపాటు గత ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కృషి చేసిన సీనియర్ నాయకులను పక్కన పెట్టి ప్రత్యర్థి పార్టీలోని నాయకులను మంత్రి చేరదీసి తమ ఆక్రమాలకు అడ్డులేకుండా చేసుకున్నారని మంత్రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో పార్టీ ప్రతిష్ట మంటగలిసింద‌న్నారు. `ప్రతి పనికి ఒక రేటులా మంత్రి కోటరీ మారింది’ అని విమర్శించారు. మంత్రి అక్రమాలు, అన్యాయాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘గడపగడపకు మన ప్రభుత్వం చప్పగా సాగుతోందని మంత్రి తీరుతో పార్టీ భ్రష్టు పట్టిపోయింద ని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో సుమారు 300 మంది వైసీపీ నాయకులు పాల్గొన్నారు.