వేటు వేసిన వేళ పైలెట్ పయనమెటు?

రాజస్థాన్ రాజకీయం మరిన్ని మలుపులు తిరిగింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభంపై అధినాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

తిరుగుబావుటా ఎగరవేసిన యువనేత సచిన్ పైలట్ పై వేటు వేయటంతో పాటు.. ఆయన్ను ఉపముఖ్యమంత్రి పదవి నుంచే కాదు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితులైన విశ్వేంద్రసింగ్.. రమేశ్ మీనా ఇద్దరు మంత్రులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అదే సమయంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కు అండగా నిలిచిన పార్టీ.. మరిన్ని కీలక నిర్ణయాలకు తాను సిద్ధమన్న సంకేతాల్ని ఇచ్చింది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండుసార్లు సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించటం.. ఆ రెండు సమావేశాలకు సచిన్ పైలెట్ హాజరు కాకపోవటం ఒక ఎత్తు అయితే.. కాంగ్రెస్ అధినాయకత్వం తరఫున రంగంలోకి దిగిన రాహుల్.. ప్రియాంకలు ఎంత చెప్పినా వినని ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహంలో ఉన్నట్లు చెబుతున్నారు.

రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పైలెట్ తో పాటు.. ఆయనకు దన్నుగా ఉన్న ఇద్దరు మంత్రుల్ని తొలగిస్తున్నట్లుగా రాష్ట్ర గవర్నర్ కు ప్రభుత్వం లేఖను అందించింది. ఇదిలా జరిగిన వెంటనే సచిన్ పైలెట్ తన ట్విట్టర్ ఖాతాలోని ప్రొఫైల్ ను మార్చుకోవటం గమనార్హం.

తన హోదాల్ని మార్చిన ఆయన.. తనను తాను టోంక్ ఎమ్మెల్యేగా.. కేంద్ర మాజీ మంత్రిగా మాత్రమే హోదాల్ని ఆయన పేర్కొన్నారు. ఆయన బీజేపీలోకి చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే.. అలాంటిదేమీ జరగదని పైలట్ వర్గీయులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే..సచిన్ పైలట్ తమ పార్టీలోకి రావాలనుకుంటే ద్వారాలు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు.

2023లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిలకు ఏడాది ముందుగా తనను సీఎంను చేయాలన్న డిమాండ్ పార్టీ అధినాయకత్వాన్ని చిరాకు పుట్టించినట్లు చెబుతున్నారు. బీజేపీ ట్రాప్ లో ఆయన పూర్తిగా పడిపోయినట్లుగా చెబుతున్నారు. తనతో పాటు తనకు అండగా నిలిచిన పదహారు మంది ఎమ్మెల్యేలకు గెహ్లోత్ సర్కారులో గౌరవప్రదమైన స్థానాలు కల్పించాలన్న డిమాండ్ కు అధినాయకత్వం ససేమిరా అంది.

ఇలాంటి క్రమశిక్షణరాహిత్యం పార్టీకి ఏ మాత్రం మేలు చేయదన్న ఉద్దేశంతోనే కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. తమ పార్టీకి ఇప్పటికి 122 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు కాంగ్రెస్ చెబుతుంటే.. అసెంబ్లీ వేదికగా చేసుకొని ఆ పార్టీ తన మెజార్టీ నిరూపించుకోవాలని విపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది.రాజస్థాన్లో బీజేపీ ఆటలు సాగవని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.

తన చర్యల కత్తికి మరింత పదును పెడుతూ కాంగ్రెస్ అధినాయకత్వం తాజాగా మరిన్ని నిర్ణయాల్ని తీసుకున్నారు. సచిన్ పైలట్ పై వేటు వేసిన గంటల వ్యవధిలోనే ఆయనకు అండగా నిలిచిన సంజయ్ ఝూను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం పార్టీలో ఇప్పుడు సంచలనంగా మారింది. అసమ్మతి బెదిరింపులకు పార్టీ లొంగదన్న సంకేతాలతో పాటు.. గీత దాటిన వారు ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవన్న సందేశాన్ని తాజా చర్యతో స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు.