జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో భారీ దెబ్బ‌..

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోప‌ణలు ఎదుర్కొంటున్న‌ హెటిరో సంస్థలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమపై కేసు కొట్టివేయాలన్న అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఏ-1గా ఉన్న జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాకే అప్ప‌టి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హెటిరోకు భూములు కేటాయించారని.. క్విడ్‌ ప్రోకో జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్న ఈ కేసు కొట్టివేయదగినది కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కేసును క్వాష్ చేసేందుకు.. సీబీఐ కోర్టు, తెలంగాణ హైకోర్టు నిరాకరించడాన్ని హెటిరో సంస్థ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ జోసెఫ్, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌ ధర్మాసనం విచారణ జరిపింది. ఏ-1గా ఉన్న జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాకే, హెటిరో సంస్థకు 80 ఎకరాల భూములు కేటాయించిన విషయాన్ని ప్రస్తావించింది. జగన్ కంపెనీ ప్రారంభించకముందే, 350 రూపాయల ప్రీమియం ధరతో హెటిరో సంస్థ షేర్లు కొనుగోలు చేసిన అంశాన్ని గుర్తుచేసింది. జగన్మోహన్‌రెడ్డికి చెందిన కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలంగా… హెటిరో గ్రూప్ సంస్థకు తెలంగాణలోని జడ్చర్ల సెజ్‌లో దరఖాస్తు చేసుకున్న రోజే 75 ఎకరాల భూమి కేటాయించారని జస్టిస్ జోసెఫ్ అన్నారు.

అక్రమాస్తుల కేసులో ఏ-6గా ఉన్న హెటిరో డైరెక్టర్ ఎం. శ్రీనివాసరెడ్డి, ఏ-4గా ఉన్న హెటిరో గ్రూప్, ఏ-3గా ఉన్న అరబిందో గ్రూప్‌ కలిసి… 75 ఎకరాల భూమి కోసం ఏ-9గా ఉన్న ఏపీఐఐసీ ఎండీకి 2006 నవంబర్ 17న దరఖాస్తు చేసుకున్న విషయం ప్రస్తావించారు. ఆ తర్వాత ఒక్కరోజులోనే భూకేటాయింపులు జరిగిన విషయాన్ని, సీబీఐ ఛార్జిషీట్‌లో చాలా స్పష్టంగా పొందుపరిచారని జస్టిస్‌ జోసెఫ్‌ అన్నారు.

అదేరోజు భూములు ఇచ్చేయమని ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ చెప్పారని.. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు తప్పు చేశారనడానికి ఇది నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. దానికి రెండు మూడు రోజుల ముందు 10 ఎకరాల కోసం ఇతర వ్యక్తులు దరఖాస్తు చేసుకున్నా కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పటి వరకు ప్రారంభమే కాని నేటి ఏపీ ముఖ్యమంత్రికి చెందిన కంపెనీకి చెందిన వాటాలను 350 రూపాయల ప్రీమియంతో కొనుగోలు చేయడమే ఇక్కడ క్విడ్ ప్రోకో ఇందులో దాచి పెట్టడానికి ఏమీ లేదు.. ఈ వ్యవహారాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగి పోయాయన్నారు.

ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలని, వీటిపై సీబీఐ పక్కాగా ఛార్జిషీటు దాఖలు చేసిందన్నారు. అందువల్ల హెటిరో సంస్థలపై కేసు కొట్టివేయడానికి వీలుకాదని స్పష్టంచేశారు. ఇప్పటి వరకు దాఖలైన చార్జిషీటపై మేజిస్ట్రేట్ తన అభిప్రాయాన్ని రాయాల్సి ఉండాలని మీరు చెప్పిన మాట సాంకేతికంగా వాస్తవమే అయితే ఇందులో జరిగిన పరిమాణ క్రమ తేదీలను పరిశీలిస్తే ఏదీ వివాదాస్పదంగా లేదు అని జస్టిస్ జోసెఫ్‌ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈ కేసును డిస్మిస్‌ చేస్తున్నాం.

ఒక్కరోజులోనే భూములు ఇచ్చేశారు. ఇక్కడ ‘మా కంపెనీల్లో పెట్టుబడి పెట్టు.. భూములు తీసుకో’ అన్న విధంగా ఈ వ్యవహారం నడిచింది అని న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తి వ్యాఖ్యల సమయంలో హెటిరో న్యాయవాది కల్పించుకుంటూ.. క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపించవచ్చు.. కానీ కోర్టులు చట్టం ప్రకారం నడుచుకోవాలని కోరుతున్నాము, విచారణ పూర్తయ్యేసరికి నిర్దోషిగా బయటపడొచ్చు… తప్పు చేశానో లేదో ముగింపు ఎలా జరుగుతుందో ఎవరికి తెలుసు అని అనగా, జస్టిస్ కేఎం జోసెఫ్ జోక్యం చేసుకుంటూ హైకోర్టు కూడా అదే ఉద్దేశంతో విచారణ జరగాలని పేర్కొంటూ క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేసిందని గుర్తు చేశారు.

కేసు నుంచి బయట పడొచ్చేమో కానీ, ఇప్పుడు కొట్టేయడానికి వీల్లేదని పేర్కొన్నదన్నారు. మన దేశంలో మేజిస్ట్రేట్‌లు అంతా… సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కంటే ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నారని న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు శనివారాలు పని చేయరు… కానీ, మేజిస్ట్రేట్‌లు శనివారాలు కూడా పని చేస్తున్నారని అన్నారు. వాళ్లకు ఆ పని చేయి.. ఈ పనిచేయి అని చెబుతుంటాం కాబట్టి వారిపై పని భారం ఎక్కువగా ఉందని జస్టిస్‌ జోసెఫ్‌ సానుభూతి వ్యక్తం చేశారు. ఛార్జిషీట్లు చాలా సూక్ష్మంగా పరిశీలించి తయారు చేసినా… మేజిస్ట్రేట్ కొన్ని విషయాలను మరిచిపోయి ఉండొచ్చన్న జస్టిస్‌ జోసెఫ్‌.. ఎస్ఎల్పీని కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.