జ‌గ‌న్ కుటుంబానికి కేంద్రం షాక్‌.. ఏం చేసిందంటే!

ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబానికి కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. త‌న మాతృమూర్తి, మాజీ ఎమ్మెల్యే విజ‌య‌మ్మ నిర్వ‌హిస్తున్న కీల‌క ట్ర‌స్టును కేంద్ర ప్ర‌బుత్వం ర‌ద్దు చేసింది. ప్ర‌స్తుతం ఈ ట్ర‌స్టును విజ‌య‌మ్మ నిర్వ‌హిస్తున్నారు. ‘విజ‌య‌మ్మ చారిట‌బుల్ ట్ర‌స్టు’ పేరుతో నిర్వ‌హిస్తున్న దీని ద్వారా.. క‌డ‌ప‌లో పేద‌ల‌కు సాయం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్క‌డ ఏం చేస్తున్నార‌నేది మాత్రం తెలియాల్సి ఉంది.

అయితే.. ఈ ట్ర‌స్టును ర‌ద్దు చేస్తూ.. కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. దీనికి కార‌ణం ఏంటంటే.. విదేవీ సంస్థ‌ల నుంచి నిధులు సేక‌రిస్తున్నార‌ని, అయితే.. వీటికి లెక్క‌లు చెప్ప‌డం లేద‌నేది కేంద్ర హోం శాఖ వ‌ర్గాలు చెబుతున్న మాట‌. దీనికి సంబంధించి ట్ర‌స్టు చైర్‌ప‌ర్స‌న్‌గా ఉన్న విజ‌య‌మ్మ‌కు గ‌తంలోనే నోటీసులు పంపించారు. అయితే, ఆమె స్పించ‌క‌పోవ‌డంతో తాజాగా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

విదేశీ నిధుల నియంత్ర‌ణ చ‌ట్టం-2010 ప్ర‌కారం.. విజ‌య‌మ్మ చారిట‌బుల్ ట్ర‌స్టును ర‌ద్దు చేస్తున్న‌ట్టు కేంద్ర హోం శాఖ స్ప‌ష్టం చేసింది. ఇక‌, ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో మ‌రో 90 ట్ర‌స్టుల‌ను, ఏపీలో ఏకంగా.. 168 స్వ‌చ్ఛంద సంస్థ‌ల లైసెన్సుల‌ను కూడా కేంద్ర హోం శాఖ ర‌ద్దు చేయ‌డం గ‌మ‌నార్హం. వాస్తవానికి 2010 నాటి ఎఫ్ ఆర్ సీఎస్ చ‌ట్టం ప్ర‌కారం.. నిధులు సేక‌రించ‌డం త‌ప్పుకాక‌పోయినా.. వాటిని ఎలా ఖ‌ర్చు చేశారు? ఎంత వ‌చ్చింద‌నేది మాత్రం నివేదిక రూపంలో ఏటా కేంద్ర హోం శాఖ‌కు స‌మ‌ర్పించాలి.

ఈ విష‌యంలో విఫ‌ల‌మైన నేప‌థ్యంలోనే ఆయా ట్ర‌స్టుల‌ను కేంద్రం ర‌ద్దు చేసింది. కొన్ని రోజుల కింద‌ట కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్ ట్ర‌స్టుల‌ను కూడా ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఏపీలో వైఎస్ జ‌గ‌న్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న మాతృమూర్తికి చెందిన సంస్థ‌పై కేంద్రం ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది.