ఏపీ బీజేపీకి మోడీ క్లాస్‌.. ప‌నిచేస్తుందా..?

ఏపీ బీజేపీకి ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ బాగానే త‌లంటారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా ఎందుకు తీసుకువెళ్ల‌లేక పోతున్నార‌నే విష‌యంపై ఆయ‌న తెలుసుకున్నారు. దీనిపై స్థానిక బీజేపీ కోర్ క‌మిటీకి కొన్ని దిశానిర్దేశాలు చేశారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుస్తామా? లేదా? అనేది ప‌క్క‌న పెట్టి నిరంత‌రం ప్ర‌జ‌ల్లోనే ఉండాల‌ని.. ముఖ్యంగా యువ‌త‌ను టార్గెట్ చేసుకుని ముందుకు సాగాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ ఓట్లు ప్ర‌ధానంగా ప‌నిచేస్తున్నాయ‌నే వాద‌న‌ను కూడా మోడీ వివ‌రించిన‌ట్టు స‌మాచారం.

మ‌రి ఈ నేప‌థ్యంలో మోడీ క్లాస్ ఏపీ నేత‌ల‌పై ఏమేర‌కు ప‌నిచేస్తుంది? అనేది ఇప్పుడు బీజేపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎందుకంటే.. బీజేపీ నేత‌ల్లో చాలా మంది వైసీపీతో సంబందాలు ఉన్న‌వారే ఉన్నారు. జీవీఎల్‌, స‌త్య‌కుమార్‌, సోము వీర్రాజు.. వంటి కీల‌క నాయ‌కుల‌కు వైసీపీలోని చాలా అగ్ర స్థానంలో ఉన్న నాయ‌కుల‌తో స‌త్సంబంధాలు ఉన్నాయి. దీంతో వారిని వీరు.. వీరిని వారు ఏమీ అన‌రు అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. పైకి ఎంత విమ‌ర్శ‌లు చేసినా.. పెద‌బొబ్బ‌లు పెట్టినా.. ప్ర‌జ‌ల్లోకి మాత్రం ఈ సంకేతాలు ఎప్పుడో వెళ్లిపోయాయి.

కొన్నాళ్ల కింద‌ట‌.. సోము వీర్రాజు రాజ‌ధాని గ్రామాల్లో పర్య‌టించిన‌ప్పుడు.. రైతుల‌కు మేం అండ‌గా ఉంటాం. రాజ‌ధాని ఇక్క‌డే ఉంటుంది. అని స‌ర్ది చెప్ప‌బోయారు. అయితే, రైతుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. మీరు మీరు ఒక‌టేగా! అని రైతులు సోము వీర్రాజు మొహంపైనే అడిగేశారు. దీంతో ముందు దీని నుంచి బ‌య‌ట‌ప‌డ‌డంపై నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. మ‌రోవైపు బీజేపీ కీల‌క నాయ‌కురాలు పురందేశ్వ‌రి ఏం చెప్పినా.. బీజేపీ నాయ‌కులు వినిపించుకోవ‌డం లేదు. ఇదే విష‌యాన్ని ఆమె ప్ర‌దాని ముందు చెప్పిన‌ట్టు స‌మాచారం.

ఆమెకు టీడీపీతో స‌త్సంబంధాలు ఉన్నాయ‌ని, కండువా క‌ప్పుకోక‌పోయినా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆమె కుమారుడికి టికెట్ ఇచ్చార‌ని బీజేపీలో ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఆమెను ప‌క్క‌న పెట్టారు. అయితే, మోడీ మాత్రం ఈ విష‌యాన్ని న‌డ్డాతో చ‌ర్చించాల‌ని సూచించి త‌ప్పుకొన్నారు. ఇక‌, జీవీఎల్‌కు, సీఎంజ‌గ‌న్ బావ‌మ‌రిది అనిల్‌కు మ‌ధ్య సంబంధాలు ఉన్నాయ‌ని.. ఆయ‌న అందుకే మౌనంగా ఉంటున్నార‌ని కూడా బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

ఇలా .. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌ల‌తోనే స‌రిపుచ్చుకుంటున్నారు త‌ప్పితే.. పార్టీని ముందుకు తీసుకువెళ్ల‌డంపై మాత్రం ఎవ‌రూ దృష్టి పెట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌దాని హెచ్చ‌రించి మూడు రోజులు అయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి కార్య‌క్ర‌మాల‌కూ రూప‌క‌ల్ప‌న చేసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.