పోల‌వ‌రం.. ఐదేళ్ల‌యినా పూర్తికాదు: హ‌రీశ్ రావు

ఏపీ ప్ర‌భుత్వం.. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి హరీశ్‌రావు. ఈ ప్రాజెక్టు ఇప్పుడే కాదు.. మ‌రో ఐదేళ్ల‌కు కూడా పూర్తికాదు.. అని వ్యాఖ్యానించారు. అంతేకాదు రాసిపెట్టుకోవాల‌ని ఏపీ ప్ర‌జ‌ల‌కు సైతం ఆయ‌న సూచించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, తెలంగాణ‌లోని కాళేశ్వరం గురించి ప్రతిపక్ష నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక అబద్దాన్ని పదేపదే చెప్పి నిజమే అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

కాళేశ్వరం ఫలాలు అందుకుంటున్న ప్రజలు ఆ అబద్దాలను తిప్పికొట్టాలని సూచించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. కాళ్వేశరం గొప్పతనాన్ని అందరికీ చెప్పాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఢిల్లీలో, హైదరాబాద్‌ పార్టీ కార్యాలయాల్లో కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుందని.. గ్రామాల్లోకి వెళ్లి చూస్తే కాళేశ్వరం ఫలితాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు ఏపీలో ప్రారంభమైన పోలవరం ఇంతవరకు పూర్తి కాలేదని తెలిపారు. అక్కడ ఇంజనీర్లను అడిగితే ఎప్పుడు పూర్తవుతుందో తెలియదంటున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు తెలంగాణ రైతులను నూకలు తినమని అవమాన పరిచారన్న హరీశ్.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గింజ కొనుగోలు చేశారని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి నల్ల చట్టాలు తెచ్చిందని ఆరోపించారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

పోలవరం పనులు మరో 5 ఏళ్లయినా పూర్తికావు. కాళేశ్వరం కంటే ముందే పోలవరం పనులు ప్రారంభించారు. పోలవరం పనుల పురోగతిపై అక్కడి ఇంజినీర్లతో మాట్లాడా. మరో ఐదేళ్లలో పూర్తయితే గొప్పేనని ఇంజినీర్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు తెలంగాణకు అందుతున్నాయి. పోలవరం పూర్తి కాలేదు… ఆ ఫలితం అందలేదు. కాళేశ్వరం పూర్తి అయింది… రాష్ట్రవ్యాప్తంగా ఆ ఫలితం అందింది. అని హరీశ్‌రావు వ్యాఖ్యానించడం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై వైసీపీ నాయ‌కుడు, జ‌ల‌వ‌న‌రుల మంత్రి అంబ‌టి రాంబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.