కోర్ మీటింగ్ లో మోడీ చెప్పింది ఇదేనా?

ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..ఏపీకి చెందిన బీజేపీ ముఖ్యనేతలతో కోర్ భేటీ నిర్వహించటం తెలిసిందే. శనివారం పలు కార్యక్రమాల్లోపాల్గొనేందుకు వచ్చిన ఆయన.. ఒక పూట ముందుగా అంటే.. శుక్రవారం సాయంత్రానికి విశాఖకు చేసుకున్న ఆయన.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ కావటం.. అనంతరం ఏపీ బీజేపీ నేతలతో కూడిన కోర్ మీటింగ్ లో కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు.

దాదాపు గంటన్నర పాటు సాగిన బీజేపీ కోర్ కమిటి భేటీలో కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ.. ఏం చేయాలి? ఎలా వ్యవహరించాలి? కేంద్ర పార్టీ ఇచ్చే సహకారం ఏమిటి? లాంటి అంశాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. వైసీపీ సర్కారు తప్పుల లెక్క తీయాలని.. చార్జిషీట్లు వేసి పల్లెపల్లెకు చెప్పాలని స్పష్టం చేయటంతో పాటు.. తన మద్దతు రాష్ట్రానికే తప్పించి.. వ్యక్తులకు కాదని.. అవినీతి.. ఆరాచకాలను ఉపేక్షించొద్దని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.

ఇన్నాళ్లు రాష్ట్రంలో జరుగుతున్న తప్పుల్ని ఎందుకు ఎండగట్టలేదని ప్రశ్నించిన మోడీ.. అలా చేయకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? అని ఎదురు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. తనకు లభించిన అవకాశాన్ని సీఎం జగన్ ఖరాబు చేసుకుంటున్నారని.. దానిని మనం ఉపయోగించుకోవాలని మోడీ వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. బీజేపీ మద్దతుపై వైసీపీ నేతలు ఏమైనా చెప్పుకోనివ్వండి.. మీ పని మీరు చేసుకుంటూ పొండి అంటూ మోడీ దిశానిర్దేశం చేశారు.

మీ పని మీరు చేస్తే.. అధిష్ఠానం అండగా ఉంటుందని తేల్చిన మోడీ మాటలు ఏపీ కమలనాథులకు కొత్త శక్తిని ఇవ్వటం ఖాయమంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ సందర్భంగా విశాఖపట్నంలోని భూకబ్జాలతో పాటు ఏపీలో నెలకొన్న పరిస్థితుల్ని ఆయన ముందు పెట్టినట్లుగా చెబుతున్నారు. జగన్ సర్కారు చేస్తున్న తప్పులపై ఎప్పటికప్పుడు చార్జిషీట్ వేసి.. పల్లె నుంచి పట్నం వరకు ప్రచారం చేయాలని మోడీ చెప్పిన తీరు చూస్తే.. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కటం ఖాయమని చెబుతున్నారు.

మోడీ చెప్పిన మాటలు.. ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. వైసీపీ సర్కారుపై నేరుగా యుద్ధానికి దిగాలని బీజేపీ నేతలకు మోడీ స్పష్టమైన సంకేతాల్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తన మాటలతో జగన్ కు తాను దన్నుగా నిలవటం లేదని.. తప్పులు చేస్తే ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ప్రధాని స్పష్టం చేసినట్లుగా చెప్పాలి. మోడీ మాటల నేపథ్యంలో ఏపీ కమలనాథులు మరింత యాక్టివ్ కావటమే కాదు.. అధికార వైసీపీపై రెట్టించిన ఉత్సాహంతో విరుచుకుపడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.