పాల్‌ను మించిన కాంగ్రెస్ నేతలు

చెప్పేవాడు చిరంజీవి అయితే.. అన్న సామెత‌ను త‌ల‌పిస్తున్నారు ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు. నానాటికీ తీసిక‌ట్టుగా మారుతున్న కాంగ్రెస్ ప‌రిస్థితిని గాడిలో పెట్టేందుకు.. కాడి మోసేందుకు ముందుకు రాని కాంగ్రెస్ నాయ‌కులు.. పార్టీ మాత్రం అధికారంలోకి వ‌చ్చేస్తుందని.. బ‌రిలోకి దిగితే త‌మ‌ను ఆప‌డం బ్ర‌హ్మ‌కు సైతం సాధ్యం కాద‌ని.. ఉత్త‌ర కుమార ప్ర‌గ‌ల్భాల‌ను మించిన కామెంట్లను దంచికొడుతూ.. కేఏ పాల్‌ను మించిపోతున్నారు.

ఇటీవ‌ల మునుగోడు ఉప పోరులో ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షులు కేఏ పాల్ ఎలా అయితే.. కామెడీ కామెంట్లు చేసి క‌డుపుబ్బ న‌వ్వించారో.. అంత‌కుమించి త‌గ్గేదేలే.. అన్న‌ట్టుగా ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు చెల‌రేగిపోతున్నారు. జెండా మోసేందుకు ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా లేని పార్టీ ఏద‌ని అంటే.. ఠ‌క్కున కాంగ్రెస్ పేరు చెబుతున్న ప్ర‌స్తుత పరిస్థితిలో ఈ గండం నుంచి బ‌య‌ట ప‌డేందుకు వ్యూహాలు వేయాల్సిందిపోయి.. ఊహాలోకంలో విహారాలు చేయ‌డం వారికే చెల్లింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజాగా సీనియ‌ర్ నాయ‌కుడు, చింతామోహన్ మాట్లాడుతూ.. మూడేళ్ల వైసిపి పాలన ముచ్చట తీరిపోయిందన్నారు. జగన్ పరిపాలన ప‌ట్ల ప్ర‌జలెవరూ సంతోషంగా లేరని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంద‌న్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి బిజెపిలు కనుమరుగైపోతాయని జోస్యం చెప్పారు. అక్క‌డితో ఆగ‌కుండా.. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు కావడం ఖాయమ‌ని బ‌ల్లగుద్దేశారు!!

ఇంకాఏమ‌నుకున్నారో.. ఏమో.. మ‌రింత గ‌ట్టిగా.. వ‌చ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్, టిడిపి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని చెప్పేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, తిరుపతిలోనూ, రాష్ట్ర వ్యాప్తంగానూ పేదలు నివాసం ఉంటున్న డీకేటి భూములకు శాశ్వత పట్టాలిస్తామ‌ని ఏడాదిన్న‌ర ముందే హామీలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరుపతి మహిళలకు వచ్చిన 7 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇచ్చే బాధ్యత త‌న‌దేన‌న్నారు. మొత్తానికి ఇవ‌న్నీ చూస్తే.. ఏపీ ప్ర‌జ‌ల‌కు మ‌రో పాల్ దొరికాడా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.