జ‌గ‌న్‌కు బీజేపీ పెద్ద‌ల ఆశీర్వాదం.. ఉంటుందా… ఉండదా!

వైసీపీ అధినేత‌.. ఏపీ సీఎం జ‌గ‌న్‌… త‌న పాల‌న సూప‌ర్‌గా ఉంద‌ని.. త‌న పాల‌న‌లో తీసుకువ‌స్తున్న అనేక ప‌థ‌కాల‌ను.. అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను.. ఇత‌ర రాష్ట్రాలు సైతం అనుస‌రిస్తున్నాయ‌ని చెబుతున్నారు. అంతేకాదు.. తాను మేనిఫెస్టోలో 2019 ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన అన్ని హామీల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని.. ఇప్పటికి ఈ మూడున్న‌రేళ్ల‌లో ఈ హామీల‌ను 98 శాతం పూర్తిచేశామ‌ని కూడా చెబుతున్నారు. అన్ని వ‌ర్గాల వారికీ త‌మ ప్ర‌భుత్వం న్యాయం చేస్తోంద‌ని కూడా .. అంటున్నారు. అయితే.. ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా.. మంచి సీఎంలు ఎవ‌రు అని.. ఒక సంస్థ ఆరా తీసింది.

ఆయా రాష్ట్రాల్లో అమ‌ల‌వుతున్న పథ‌కాలు.. ప్ర‌జ‌ల‌కు అందుతున్న సుప‌రిపాల‌న విష‌యాల‌పై స‌ర్వే చేసింది. దీనిలో సీఎం జ‌గ‌న్ నాలుగో స్థానానికి ప‌డిపోయారు. అంటే.. ప్ర‌జ‌లు ఆయ‌న‌ను ఎంత గా ఆద‌రిస్తున్నారో.. అర్ధ‌మ‌వుతుంది. అయితే.. ఈ విష‌యంపై కేంద్రంలోని బీజేపీ పాల‌కులు మాత్రం ఆరా తీస్తున్న‌ట్టు తెలుస్తోంది. అస‌లు ఏపీలో ఏం జ‌రుగుతోంది? ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ పాల‌న భేష్‌గా ఉంద‌ని.. ఎప్పుడు వ‌చ్చినా.. చెబుతున్నారు. మ‌రి ఇప్పుడు ఎందుకు నాలుగో స్థానానికి ప‌డిపోయార‌నే విష‌యంపై కీల‌క నేత‌లు.. ఏపీ బీజేపీ నాయ‌కుల‌ను ఫీడ్ బ్యాక్ కొరిన‌ట్టు స‌మాచారం

ఏపీ సీఎం జ‌గ‌న్ పాల‌న అనుకున్న విధంగా అయితే.. లేద‌ని..కేంద్రంలోని బీజేపీ పాలకులు ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ భావించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో దృష్టి పెట్ట‌క‌పోయినా.. నాయ‌కులు మాత్రం ఇదే ఆలోచ‌న‌లతో ఉన్నార‌నేది మాత్రం తెలుస్తోంది. ఇదే క‌నుక నిజ‌మైతే.. ఏపీలో బీజేపీ వ్యూహాలు మారిపోవ‌డం ఖాయం. ఇక్క‌డ బీజేపీ పుంజుకోక‌పోయినా.. ప‌ర్వాలేదు. కానీ, ఇక్క‌డ ఏర్ప‌డే ప్ర‌భుత్వం ఏంట‌న్న‌ది మాత్రం కేంద్రంలోని బీజేపీ నేత‌ల‌కు అత్యంత కీల‌కం.

గ‌తంలో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తార‌ని తెలిసి.. ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చారు. అలాగే.. 2019లో జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని అనుకుని.. ఆయ‌న‌కు ద‌న్నుగా నిల‌బ‌డి.. త‌మ‌కు సానుకూలంగా మార్చుకున్నారు. ఇప్ప‌డు కూడా.. అంతే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. ఇక్క‌డ ఎవరు బ‌లంగా ఉంటారో వారికే.. బీజేపీ నేత‌లు మ‌ద్ద‌తుగా నిలుస్తారు. సో.. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి.. జ‌గ‌న్‌కు బీజేపీ పెద్ద‌ల ఆశీర్వాదం.. ఉంటుందా? ఉండదా? అనేది తేలిపోతుంది.