జనసేన మీటింగ్‌కు స్థలం ఇచ్చారని..

రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అవతలి పార్టీ వాళ్లను అధికార పార్టీ, ప్రభుత్వం టార్గెట్ చేయడం కొత్తేమీ కాదు. కానీ ప్రభుత్వం మారినపుడు కొన్ని రోజులు ఇలాంటి వాటి మీద దృష్టిపెట్టి.. ఆ తర్వాత పరిపాలన మీద దృష్టిసారిస్తుంటాయి ప్రభుత్వాలు. కానీ అధికారంలో ఉన్నంత కాలం ప్రతిపక్ష పార్టీలను, తమకు కంటగింపుగా మారిన వారిని వేధించడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే చూస్తున్నాం.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తిన వారిని.. అలాగే ప్రతిపక్షాలకు సహకరించిన వారిని టార్గెట్ చేసి ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం, వారికి నష్టం చేకూర్చడం చేస్తోంది జగన్ సర్కారు. ఈ క్రమంలో సామాన్య ప్రజలను కూడా వదలట్లేదు.

కొన్ని నెలల కిందట జనసేన పార్టీ ప్లీనరీ సమావేశం కోసం అనుమతులు అడిగితే జగన్ సర్కారు ఆ పార్టీ నేతల్ని ఎంతగా ఇబ్బంది పెట్టిందో తెలిసిందే. ప్రభుత్వ స్థలాలను ఇందుకోసం కేటాయించడానికి ససేమిరా అంది. చివరికి ఈ మీటింగ్ కోసం మంగళగిరి ప్రాంత రైతులు ముందుకు వచ్చారు. తమ స్థలాన్ని జనసేన మీటింగ్ కోసం ఇచ్చారు. ప్రైవేటు స్థలంలో ప్లీనరీ మీటింగ్ జరుపుకున్నప్పటికీ రకరకాలుగా జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి పోలీసులు ప్రయత్నించడం తెలిసిందే. కట్ చేస్తే ఇప్పుడు తమ అభీష్టానికి వ్యతిరేకంగా జనసేన ప్లీనరీకి స్థలం ఇచ్చిన రైతులను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది.

మంళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పు కార్యక్రమం పేరుతో జనసేన ప్లీనరీకి స్థలం ఇచ్చిన వాళ్ల ఇళ్లను జేసీబీలతో కూల్చేస్తుండడం గమనార్హం. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామాన్య జనం మీద కూడా ఈ స్థాయిలో కక్ష సాధింపులకు పాల్పడే ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.