అయ్యో టీ కాంగ్రెస్.. మునుగోడులో ముక్కలు చెక్కలు..!

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందా..? ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఖ్యాతి కూడా మిగలని పరిస్థితి నెలకొందా..? కోవర్టులు, సీనియర్ల దొంగదెబ్బతో ఆ పార్టీ విలవిలలాడుతోందా..? రేవంత్ జాకీలు వేసినా లేవడం లేదా..? మునుగోడులో పార్టీ శ్రేణులు ముక్కలు చెక్కలు అయ్యాయా..? అధికారం దేవుడెరుగు.. ఉప ఎన్నికలో కనుక ఓడితే రాష్ట్రంలో పార్టీ మనుగడ కష్టమేనా..? తమ స్థానాన్ని పువ్వుల్లో పెట్టి పువ్వు పార్టీకి అందించబోతుందా..? అంటే పరిస్థితులు అలాగే గోచరిస్తున్నాయి.

కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి కమలం పార్టీలో చేరిపోయారు. ఇక్కడ పార్టీ అధికారంలో ఉన్నపుడు అన్నిరకాల పదవులు అనుభవించిన ఆ సోదరులు సరైన సమయంలో దెబ్బకొట్టారు. కేవలం రేవంతును బూచిగా చూపి తమ లక్ష్యం నెరవేర్చుకుంటున్నారు. రాజగోపాల రెడ్డి గత మూడేళ్ల నుంచీ అధిష్ఠానాన్ని, పార్టీ సీనియర్లను ధిక్కరిస్తున్నా వేటువేయకపోవడం అధిష్ఠానం చేసిన మొదటి తప్పుగా భావించవచ్చు.

ఈ సోదరులపై నమ్మకం లేకనే ఏడాదిన్నర క్రితం పీసీసీ అధ్యక్ష పదవిని ఉత్తమ్ నుంచి రేవంతుకు కట్టబెట్టింది ఆ పార్టీ అధిష్ఠానం. వెంటనే నిరసన గళం విప్పిన వెంకటరెడ్డి ఓటుకు నోటు కేసు తరహాలోనే రేవంతు పదవిని కొనుక్కున్నాడని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంటే.. గత పీసీసీ అధ్యక్షుల నియామకం కూడా ఇలాగే జరిగిందా అనే అనుమానం అన్ని పార్టీలో కలిగించారు వెంకటరెడ్డి. అప్పటికైనా తేరుకొని ఆయనను అదుపులో పెట్టకపోవడం.. లేదా వేటువేయకపోవడం అధిష్ఠానం చేసిన రెండో తప్పు.

ఇక మూడో తప్పు.. రేవంతుకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోవడమే. పీసీసీ అధ్యక్ష పదవితో పాటు పార్టీలో స్వేచ్ఛ కూడా ఇస్తే రేవంత్ ఆలోచన.. ప్రణాళికలు మరో విధంగా ఉండేవి. వర్కింగ్ ప్రెసిడెంటు పదవిలో ఉన్నప్పుడే పది రోజుల పాటు పాదయాత్ర చేస్తే అద్భుత స్పందన వచ్చింది. అలాంటిది పీసీసీ ప్రెసిడెంటు హోదాలో రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తే అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన వచ్చి మరో వైఎస్ అయ్యేవారు.
పాదయాత్రకు అవకాశం లేకుండా సీనియర్లు అడ్డకట్ట వేశారు. సొంత పార్టీలోనే అధికార పార్టీకి కోవర్టులున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇపుడు తమ స్థానానికి బీజేపీ ఎసరు పెడుతుండడంతో సీనియర్లకు ఇప్పుడిప్పుడే వాస్తవం బోధపడుతోంది. కానీ.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అనే చర్చ జరుగుతోంది.

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ వాస్తవ పరిస్థితి అలాగే ఉంది. ఆ పార్టీ శ్రేణులు మూడు మార్గాలుగా చీలిపోయాయి. రాజగోపాల రెడ్డితో కొంత పోను.. మిగతా శ్రేణులను అధికార పార్టీ లాగేసింది. ఇక మిగిలి ఉన్న కాస్తో కూస్తో బలంతోనే నెట్టుకొస్తోంది. ప్రచారంలో కూడా ఆర్థికంగా అంగబలం ఉన్న ఆ రెండు పార్టీలతో పోటీపడలేక చేతులెత్తోస్తోంది. ఉప ఎన్నిక ఫలితాల తర్వాత ఆ భవిష్యత్తు ఏమిటో చూడాలి మరి.