ఫామ్‌హౌజ్ ఘ‌ట‌న‌: ఉల్లిక్కి పడిన బీజేపీ

Bandi Sanjay

రూ.400 కోట్ల‌ను న‌లుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేల‌కు ఇచ్చి.. వారిని త‌మ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేసింద‌ని.. టీఆర్ఎస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి.. పోలీసులు కూడా.. దాడులు చేసి.. మ‌ధ్య‌వ‌ర్తుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాదం.. రాష్ట్రాన్ని ఒక్క‌సారిగా కుదిపేసింది. దీనికి మూలాలు ఢిల్లీలో ఉన్నాయ‌ని అంటున్నారు.

ఈ ఘటనపై బండి సంజయ్ బుధ‌వారం అర్ధ‌రాత్రి మీడియాతో మాట్లాడారు.ఈ ఫామ్‌హౌజ్ అంశంపై ఆసాంతం ఆయ‌న కామెడీగా మాట్లాడ‌డం గ‌మ‌నార్హం. “టీఆర్ఎస్‌ ఒక పెద్ద డ్రామా కంపెనీ. ఆ పార్టీ కట్టుకథలు చూస్తే ప్రజలంతా నవ్వుకుంటారు. ఫామ్‌హౌజ్‌లో ఉన్నవాళ్లు బీజేపీ వాళ్లని ఎవరు చెప్పారు? ఫామ్‌హజ్‌ వాళ్లదే(టీఆర్ఎస్‌), ఫిర్యాదు చేసింది వాళ్లే. ఒక మంత్రి పై హత్యాయత్నం జరిగిందని గతంలోనూ డ్రామా ఆడారు. బేరసారాలకు ఎక్కడైనా స్వామీజీలు వెళ్తారా? హిందూ ధర్మం అంటే కేసీఆర్‌కు ఎందుకంత కోపం? ఈ ఘటన పై మూడు రోజులుగా ఎమ్మెల్యేలు సమావేశమై కుట్ర చేశారు” అని ఎదురు దాడి చేశారు.

అంతేకాదు… “నలుగురు ఎమ్మెల్యేలను పీఎస్‌కు ఎందుకు తరలించలేదు? వారు నేరుగా ప్రగతిభవన్‌కు ఎలా వెళ్తారు? ఆ నలుగురు ఎమ్మెల్యేలను అర్ధరూపాయికి కూడా ఎవరూ కొనరు. తన పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించేందుకే ఈ నాటకమాడారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చూసుకునేందుకే ఈ నాటకం. కేసీఆర్‌ నాటకమంతా త్వరలోనే బయటపడుతుంది. ఈ నాటకమంతా త్వరలోనే కేసీఆర్‌ మెడకే చుట్టుకుంటుంది. హిందూ సమాజాన్ని కించపరిచేందుకు కేసీఆర్‌ కుట్రపన్నారు. హిందూ సమాజాన్ని కించపరిచేందుకే స్వామిజీని ఇరికించారు. టీఆర్ఎస్‌ ఆరోపణల పై సమగ్ర దర్యాప్తు చేయిస్తాం. ఫామ్‌హౌజ్‌ అడ్డగా గుట్కా వ్యాపారం నడుస్తోంది” అని బండి సంజయ్‌ విమర్శించారు.

డీకే ఫైర్‌…

ఫామ్ హౌజ్ ఎపిసోడ్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో కొత్త డ్రామాకు తెర తీశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు బీజేపీ వ్యక్తులంటూ కొత్త కథ సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. మునుగోడులో టీఆర్ ఎస్ ఓడిపోతుందనే కేసీఆర్‌ ఈ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.