వైసీపీ ఓటు బ్యాంకు పై జ‌న‌సేన క‌న్ను..

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న జ‌న‌సేన‌కు ఎన్ని సీట్లు వ‌స్తాయి? ఎన్ని ఓట్లు వ‌స్తాయి.? అనేది ఆస‌క్తిగా మారింది. ఇప్పుడు టీడీపీతో చేతులు క‌లిపిన ద‌రిమిలా.. ఈ చ‌ర్చ మ‌రింత ఎక్కువ‌గా సాగుతోంది. ప్ర‌స్తుతం వ‌చ్చే ఎన్నిక‌ల‌ పై దృష్టి పెట్టిన జ‌న‌సేన‌.. జిల్లాల వారీగా.. ఓటు బ్యాంకు పై దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలో ఉభ‌య‌గోదావ‌రి, విశాఖ‌, అనంత‌పురం, క‌ర్నూలు, చిత్తూరు, ఉత్త‌రాంధ్ర‌ జిల్లాల‌పై పెద్ద‌గానే ఆశ‌లు పెట్టుకుంది. ఈ జిల్లాల్లో దూకుడు ప్ర‌ద‌ర్శించి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌నీసం 10 నుంచి 15 సీట్ల‌యినా.. గ‌ట్టిగా సాధించాల‌నేది అంత‌ర్గ‌త నిర్ణ‌యం.

అయితే.. ఆయా జిల్లాల్లో ఎవ‌రి ఓట్లు జ‌న‌సేన‌కు అనుకూలంగా ఉన్నాయి.? అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే..సంస్థాగ‌తంగా జ‌న‌సేన‌కు ఓట్లు లేవు. 2014 లో పోటీకి దూరంగా ఉంది. 2019లో పోటీ చేసినా.. టీడీపీ ఓట్లు చీలాయ‌నే అభిప్రాయం ఉంది. అప్ప‌ట్లో వ‌చ్చిన ఓట్ల‌న్నీ కూడా.. టీడీపీకి ప‌డాల్సిన‌వేన‌ని.. అంటారు. ఉదాహ‌ర‌ణ‌కు న‌ర‌సాపురంలో పార్ల‌మెంటు స్థానానికి జ‌న‌సేన పోటీ చేసింది. ఇక్క‌డ నాగ‌బాబు కు వ‌చ్చిన ఓట్ల‌న్నీ..కూడా టీడీపీకి ప‌డాల్సిన ఓట్లేన‌ని ఒక లెక్క ఉంది.

దీంతో ఓట్లు చీలిపోయి.. టీడీపీ ప‌రాజ‌యం పాలైంది. ఇక‌, రాజోలు లోనూ ఇదే ప‌రిస్థితి ఎద‌రైంది. ఇక్క‌డ జ‌న‌సేన గెలిచింది. కానీ, ఓట్లు మాత్రం టీడీపీవ‌నే అంచ‌నా వుంది. అంటే.. 2019లో టీడీపీ ఓట్ల‌నే జ‌న‌సేన త‌న ఖాతాలో వేసుకుంది. ఫ‌లితంగా.. ఓట్లు రాక టీడీపీ ఇబ్బంది ప‌డింది. గెలుస్తామ‌ని అనుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ ప‌రాజ‌యం పాలైంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓటు చీలి.. అది త‌న‌కు ప‌డేలా ప్లాన్ చేస్తున్నార‌ట జ‌న‌సేనాని. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్న నేప‌థ్యంలో ఇది మ‌రింత ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌ని అంటున్నారు.

అయితే.. ఇది ఎంత వ‌ర‌కు సాధ్య‌మ‌వుతుంది? అనేది ప్ర‌శ్న‌. ఇప్ప‌టికిప్పుడు ఉన్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. వైసీపీ ఓటు బ్యాంకు ముఖ్యంగా మ‌హిళా ఓటు చీలే అవ‌కాశం లేదు. గ‌తంలో వైసీపీకి ఓటేసిన మ‌హిళల కు ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరుతోంది. దీంతో వారంతా మ‌ళ్లీ వైసీపీకే ఓటేయ‌నున్నారు. ఎటొచ్చీ.. మ‌రోసారి టీడీపీ ఓటు బ్యాంకుకే జ‌న‌సేన ఎస‌రు పెడుతోంద‌నే అభిప్రాయం టీడీపీ నేత‌ల్లో ఉంది. దీని నుంచి ఎలా బ‌య‌ట‌కు రావాల‌నే విష‌యంపైనే నాయ‌కులు దృష్టి పెట్టార‌ట‌. అంటే.. టీడీపీ ఓటు బ్యాంకు.. చెద‌ర‌కుండా.. జ‌న‌సేన గెలుపు గుర్రం ఎక్కాలంటే.. ఏం చేస్తారో చూడాలి.