ఉప ఎన్నికలా.. జగన్ కు ఇస్టం లేదు

మూడు రాజ‌ధానుల విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న కొంద‌రు ఎమ్మెల్యేలు, మంత్రులు.. ఈ పాటే పాడుతున్నారు. అమ‌రావ‌తి రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌పై నిప్పులు చెరుగుతున్నారు. మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, సీదిరి అప్ప‌ల‌రాజు, గుడివాడ అమ‌ర్నాథ్‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. ఈ వాద‌న‌నే వినిపిస్తున్నారు. ఇక‌, ఎమ్మెల్యేల్లో కొంద‌రు ఇదే బాట ప‌ట్టారు. ఉద్య‌మాలుచేసేందుకు రెడీ అంటూ.. పార్టీకి.. అధిష్టానానికి కూడా సంకేతాలు పంపించారు. ఇప్ప‌టికే ఒక జేఏసీని ఏర్పాటు చేసుకుని.. ఉద్య‌మాలు తీవ్ర‌త‌రం చేసేందుకు రెడీ అయ్యారు.

ఇక‌, పార్టీత‌ర‌ఫున ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉన్న ఈ విష‌యాన్ని మ‌రింత లోతుగా.. ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని కూడా.. భావించారు. ఇదిలావుంటే.. చోడ‌వ‌రం ఎమ్మెల్యే ధ‌ర్మ‌శ్రీ.. మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసేందుకు ముందుకు వ‌చ్చారు. ధ‌ర్మ‌శ్రీ ఇప్ప‌టికే లెట‌ర్ హెడ్‌పై త‌ను రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి.. సంత‌కం కూడా పెట్టారు. అయితే.. ఇది చెల్ల‌లేదు. అది వేరే సంగ‌తి. అయితే.. ధ‌ర్మాన మాత్రం తాను రాజీనామా చేస్తాన‌ని చెప్పినా.. సీఎం జగ‌న్ దానికి ఒప్పుకోలేద‌ని.. అందుకే వెన‌క్కి త‌గ్గాన‌ని చెప్పారు.

ఇదిలావుంటే.. సీదిరి అప్ప‌ల‌రాజు కూడా.. త‌ను రాజీనామాకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఇలా.. మూడు రాజ‌ధానుల కోసం.. ముచ్చ‌ట‌ప‌డుతున్న వారిలో ఉన్న మంత్రులు. ఎమ్మెల్యేలు.. పోటా పోటీగా.. రాజీనామాల‌కు రెడీ అనే సంకేతాలు ఇచ్చారు. అయితే.. వీరికి.. అధిష్టానం నుంచి ఎలాంటి సిగ్న‌ల్ రాలేదు. పైగా.. మీ పోరాటం మీరు చేయండి.. మేం చూసుకుంటాం.. అని సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ధ‌ర్మాన ప్ర‌క‌టించారు. అయితే.. వాస్త‌వానికి. ఇలా నాన్చ‌డం వెనుక‌.. వీరు రాజీనామాలు చేస్తే.. ఆ వెంట‌నే ఉప ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌డ‌మే కార‌ణంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఉప ఎన్నిక‌లు వ‌స్తే.. గ‌తంలో వ‌చ్చిన‌వాటిలా అయితే.. ఉండ‌వు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు.. ఒక పార్ల‌మెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌రిగింది. అయితే.. అవి.. అక్క‌డ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వారు చ‌నిపోవ‌డంతో వ‌చ్చిన ఎన్నిక‌లు.. కానీ, ఇప్పుడు .. మంత్రులు , ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని. ప్ర‌భుత్వంలో ఉండి మూడు రాజ‌ధానులు సాధించ‌లేకఇలా రాజీనామాలు చేశార‌నే ప్ర‌చారం.. ప్ర‌తిప‌క్షాల నుంచి పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని.. అందుకే జ‌గ‌న్ వ‌ద్దంటున్నార‌ని అంటున్నారు. మ‌రి ఏది నిజ‌మో తేలాలంటే.. వెయిట్ చేయాల్సిందే.