మునుగోడులో టీడీపీ పది వేల ఓట్లు ఎవరి ఖాతాలో..!

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మహారంజుగా సాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ఇక అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ఉద్రుతం చేయబోతున్నాయి. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా దూసుకెళుతున్నాయి. వీటికి తోడు చిన్న పార్టీలు, బలమైన ఇండిపెండెంట్లు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో అందరి చూపూ టీడీపీ, షర్మిల పార్టీలపై పడింది.

ఈ రెండు పార్టీలు పోటీలో లేకపోవడంతో వారి ఓట్లు ఎవరికి బదిలీ అవుతాయోననే టెన్షన్ అందరిలో నెలకొంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎక్కువగా ఉండడంతో షర్మిల పార్టీ పోటీలో ఉంటే గణనీయమైన ఓట్లే సాధించి ఉండేదని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే ఆమె పార్టీ కొత్తది కావడం.. బరిలో లేకపోవడంతో బలంపై అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది.

అయితే.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల రెడ్డికి ఆమెకు పరిచయాలు ఉండడం.. రెడ్డి కులస్థుల ఓట్లు చీలిపోకుండా చూసే ఉద్దేశంతో షర్మిల ఆయనకే లోపాయికారీ మద్దతు తెలుపుతోందని సమాచారం. ఎటొచ్చీ టీడీపీ పరిస్థితే గందరగోళంగా మారిందట. ఉప ఎన్నికలో పోటీకి దూరంగా నిలవడంతో ఆ పార్టీ శ్రేణులు ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక అయోమయంలో పడిపోయారట. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం నుంచి సరైన మార్గనిర్దేశనం లేకపోవడంతో కార్యకర్తలు చౌరస్తాలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎంత లేదన్నా మునుగోడులో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల హవాలో ఇక్కడి నుంచి ఒక్కసారి కూడా గెలవకపోయినా ప్రతీ ఎన్నికల్లో నిర్ణయాత్మకమైన ఓట్లు సాధించేది. ఇప్పటికీ ఆ పార్టీకి నియోజకవర్గంలో సుమారు పది వేల ఓటు బ్యాంకు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన జక్కలి ఐలయ్య యాదవ్ కు స్థానికంగా మంచి పేరే ఉంది. పోటీ చేసి ఉంటే కచ్చితంగా ఇతర పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉండేది.

ఇపుడు ఆ పరిస్థితి లేకపోవడంతో తాము ఎవరితో చేతులు కలపాలో తెలియక నేతలు సందిగ్ధంలో ఉన్నారట. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమ దూరంలో ఉన్న ఈ పార్టీ నేతల మద్దతుపై అందరూ ఆశతో ఎదురుచూస్తున్నారట. అయితే.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు మళ్లీ బీజేపీ వైపు కదులుతున్నందున ఆ పార్టీకే ఓట్లు బదలాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు కావడం అంటే ఇదే మరి. ఒకప్పుడు టీడీపీ కోసం బీజేపీ పని చేసింది. ఇపుడు అంతా రివర్స్ అయిపోవడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారట. విధి అంటే ఇదే మరి.