KCR మొదటి మీటింగ్ విశాఖలోనేనా?

కేసీయార్ ఆధ్వర్యంలో జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభ విశాఖపట్నంలో పెట్టాలని ఆలోచన జరుగుతోందట. సంక్రాంతి పండుగ తర్వాత ఏపీలో బహిరంగ సభ నిర్వహణతో పార్టీని గ్రాండ్ గా లాంఛ్ చేయాలని కేసీయార్ అనుకున్నారు. విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ బహిరంగ సభ పెట్టాలని అనుకున్నారు. అయితే తాజా పరిణామాల్లో విశాఖనే బెస్ట్ ప్లేస్ అని కేసీయార్ డిసైడ్ అయ్యారట.

ఉత్తరాంధ్రలో కేసీయార్ సామాజిక వర్గం బలంగా ఉంది కాబట్టి బహిరంగ సభ సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే సామాజికవర్గం ఉన్నంత మాత్రాన బహిరంగసభలు సక్సెస్ అవుతాయా అంటే ఎవరు చెప్పలేరు. అందుకనే సభకు ముందుగానే కొందరు నేతలను అక్కడికి పంపి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేయాలని కేసీయార్ డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగా తొందరలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీలో టూర్ చేయబోతున్నట్లు సమాచారం.

బహిరంగసభ జరిగేలోపే ఏపీలోని సీనియర్ నేతల్లో బీఆర్ఎస్ లో చేరేవాళ్ళకోసం గాలమేస్తున్నారట. ఉత్తరాంధ్రలోని మాజీమంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావుతో పాటు కడపలోని డీఎల్ రవీంద్రారెడ్డితో కూడా ఇప్పటికే తలసాని మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. వీళ్ళే కాకుండా మరికొందరితో కూడా తలసాని మాట్లాడుతున్నారట. ఇదే సమయంలో తనకు బాగా సన్నిహితంగా ఉండే మరికొందరితో కేసీయార్ మాట్లాడారట.

బహిరంగ సభ స్థలం, తేదీ నిర్ణయమయ్యేలోగా పార్టీలో చేరే నేతలు కూడా ఫైనల్ అవ్వాలని కేసీయార్ పట్టుదలగా ఉన్నారు. అయితే రాష్ట్ర విభజనకు కారుకుడు, ఏపీ ఇబ్బందుల్లో ఉండటానికి ప్రధాన కారకుడైన కేసీయార్ పార్టీకి ఏపిలో ఆదరణ ఉంటుందా అనేది పెద్ద సందేహం. విభజన ఉద్యమం సమయంలో కానీ తర్వాత కూడా ఏపీ గురించి కేసీయార్ ఎంత చీపుగా మాట్లాడారు, ఎంత ఘోరంగా తిట్టారనే విషయాన్ని ఎవరు మరచిపోలేకుండా ఉన్నారు. మరీ పరిస్థితుల్లో కేసీయార్ ఏ ధైర్యంతో ఏపీలో తన పార్టీని విస్తరించాలని అనుకుంటున్నారో అర్ధం కావటం లేదు.