ఇందుమూలంగా.. కామ్రెడ్స్ తేల్చింది ఏంటంటే!

అవును.. వ‌రుస‌గా ఐదు రోజులపాటు సీపీఐ ఆధ్వ‌ర్యంలో జాతీయ మ‌హాస‌భ‌లు విజ‌య‌వాడ వేదిక‌గా జ‌రిగాయి. పార్టీ కొత్త కార్య‌ద‌ర్శిగా.. డి.రాజానే తిరిగి ఎంపిక చేశారు. వాస్త‌వానికి ఈ స‌భ‌ల‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. అనేక అంచ‌నాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో ప‌రిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణ‌లో సీపీఐకి పుంజుకునే అవ‌కాశం ఉంది. అదేస‌మ‌యంలో ఏపీలోనూ.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకుంటే.. క‌నీసంలో క‌నీసం.. ఒక్క స్థానంలో అయినా.. గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు ఉన్నాయి.

ఎందుకంటే.. సీపీఐ త‌ర‌ఫున‌.. కె.నారాయ‌ణ‌, ఏపీ సీపీఐ కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌లు బాగానే పోరాడుతున్నారు. ఎక్క‌డ చూసినా..వారి హ‌వా క‌నిపిస్తోంది. పైగా.. రాజ‌ధాని అమ‌రావ‌తికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ స‌ర్కారును కూడా ఎండ‌గ‌డుతున్నారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో సీపీఐపైఏపీలో అంచ‌నాలు పెరిగాయి. పార్టీ కొంచెం పుంజుకుంటే.. క‌నీసం.. అటు అనంత‌పురంలో కానీ.. ఇటు గుంటూరు.. విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో కానీ.. పార్టీ గెలుపు గుర్రం ఎక్కేందుకు అవ‌కాశం ఉంది.

అయితే.. ఈ విష‌యాల‌పై ఎక్క‌డా తాజాగా జ‌రిగిన స‌భ‌ల్లో దృష్టి పెట్ట‌లేదు. కేంద్రంపైనే ఎక్కువ‌గా దృష్టిపెట్టారు. స‌రే.. జాతీయ మ‌హాస‌భ‌లు కాబ‌ట్టి.. ఖ‌చ్చితంగా.. ఆ వ్యూహం అనుస‌రించాల్సిందే. అయితే.. కీల‌క‌మైన ఏపీలోమ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంంలో ఇక్క‌డ అనుస‌రిం చ‌బోయే వ్యూహాన్ని కూడా కామ్రెడ్లు చెప్పేసి ఉంటే బాగుండేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అంతేకాదు… పొత్తుల విష‌యాన్ని కూడా చెప్పలేదు. తాము ఎవ‌రితోపొత్తు పెట్టుకునేదీ సిద్ధ‌మ‌నిచెప్పి ఉంటే.. బాగుండేద‌ని కార్య‌క‌ర్త‌లు అంటున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలానూ.. టీడీపీతో జ‌ట్టుకు సీపీఐ మొగ్గు చూపుతోంది. అయితే.. టీడీపీ బీజేపీవైపు చూస్తోంది. ఈ ప‌రిణామాల‌తోకామ్రెడ్లు ఎలాంటి వ్యూహం రెడీ చేసుకుంటార‌ని అంద‌రూ ఎదురు చూశారు. కానీ, ఎక్క‌డా ఎన్నిక‌ల ఊసు.. పొత్తుల మాట లేకుండానే స‌భ‌కు ముగింపు ప‌లికారు. మోడీని ఎదిరంచ‌డం సాధ్యం కాద‌ని.. మ‌రో ప‌దేళ్ల వ‌ర‌కు.. ఆయ‌న రాజ్యం కొన‌సాగుతుంద‌ని మాత్రం ఒక తీర్మానానికి వ‌చ్చేశారు. ఏతా వాతా ఎలా చూసుకున్నా.. కామ్రెడ్స్ తేల్చింది ఏమీక‌నిపించ‌డం లేద‌నే టాక్ క‌మ్యూనిస్టు పార్టీల్లో వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.