ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎంపీగా జేపీ పోటీ?

లోక్‌స‌త్తా పార్టీ పెట్టి ఒక‌ప్పుడు యువ‌త దృష్టిని బాగా ఆక‌ర్షించిన జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ.. తనపై పెట్టుకున్న అంచ‌నాల‌ను నిల‌బెట్టుకోలేక‌పోయారు. కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయ‌న ప‌నితీరు ఆశించినంత గొప్ప‌గా అయితే లేక‌పోయింది. ఆయ‌నేమీ మిగ‌తా ఎమ్మెల్యేల్లా అవినీతి, అక్ర‌మాల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో నిలిచింది లేదు కానీ.. జేపీ గురించి జ‌నం ప్ర‌త్యేకంగా మాట్లాడుకునే స్థాయిలో అయితే ఎమ్మెల్యేగా త‌న‌దైన ముద్ర వేయ‌లేక‌పోయారు. దీంతో ఒక పర్యాయానికే ఎమ్మెల్యే పదవి దూరమైంది.

ఆ తర్వాత రాష్ట్ర విభజన అనంతరం 2014లో మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారాయన. ఆపై రాజకీయాల్లో ఉన్నారంటే ఉన్నారనిపిస్తున్నారే తప్ప.. క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. ఐతే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జేపీ ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తుండడం విశేషం.

తాజాగా విజయవాడలో జరిగిన లోక్‌సత్తా పార్టీ కార్యవర్గ సమావేశం సందర్భంగా జేపీ ఏపీ నుంచి ఎంపీగా పోటీ చేయాలన్న తీర్మానం చేసినట్లుగా చెబుతున్నారు. ఈ సమావేశంలో జేపీ కూడా పాల్గొన్నారు. ఐతే ఆయన తాను పోటీ చేయడం గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఆయన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై చేసిన కీలక వ్యాఖ్యల్ని బట్టి చూస్తే తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేలాగే కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన అమరావతి రాజధాని మీద జేపీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కోర్టులు ఎప్పుడో స్పష్టం చేశాయని, చట్టప్రకారం నిర్ణయించిన రాజధానిని మార్చడానికి వీల్లేదని జేపీ స్పష్టం చేశారు. రాజధానిని మార్చే అధికారం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, రాజధాని విషయంలో ఏపీ సర్కారు తికమక చేస్తోందని ఆయనన్నారు. తుగ్లక్ కూడా రాజధానులు మార్చాడంటూ పరోక్షంగా సీఎం జగన్‌కు ఆయన చురకలంటించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డ జేపీ.. తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే ముందు తన స్టాండ్ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పినట్లయింది ఈ ప్రెస్ మీట్ ద్వారా.