మునుగోడు పోరు: క‌మ‌ల‌నాథుల క్యాస్ట్ గేమ్ !

మునుగోడు ఉప ఎన్నిక‌లో ఎలాగైనా విజ‌యం ద‌క్కించుకుని.. త‌మ అస్తిత్వాన్ని కాపాడుకోవాల‌ని భావిస్తున్న బీజేపీ నాయ‌కులు అన్ని అస్త్రాల‌ను ఇక్క‌డ ప్ర‌యోగిస్తున్నారు. ఈ క్ర‌మంలో కులాల వారీగా క‌న్నేశారు. కుల సంఘాలవారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రచారానికి కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ప్రముఖ నేతలను రంగంలోకి దించేందుకు సమాయత్తమవుతున్నారు.

సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న‌ మునుగోడు ఉపఎన్నికను బీజేపీ సెమీ ఫైనల్‌గా భావిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుందని అంచనావేస్తున్న బీజేపీ పెద్ద‌లు.. చిన్న‌లు.. ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దక్షిణాదికి తెలంగాణను గేట్ వేగా భావిస్తున్న జాతీయ నాయకత్వం ఈ ఎన్నికల్లో గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. జాతీయ నేతలతో పాటు కేంద్రమంత్రులను ప్రచార బరిలోకి దింపుతోంది.

కుల సంఘాల ఓట్లపై దృష్టి సారించిన బీజేపీ ఇప్పటికే కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌ను రంగంలోకి దింపింది. చౌటుప్పల్‌లో యాదవ సంఘాల నేతలతో సమావేశమమైన ఆయన.. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, దళితబంధు వంటి పథకాలపై ప్రశ్నించారు.

యాదవ సంఘం నేతలను చైతన్యపరిచినట్లే అక్కడున్న ఓటర్లను ప్రభావితం చేసే నాయకులతో పాటు కుల ప్రాతిపదికన నేతలను తీసుకెళ్లి ప్రచారాన్ని వేగవంతం చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మహిళా మోర్చా నేతలు సైతం ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీకి రాష్ట్ర కురుమ సంఘం మద్దతు ప్రకటించడం గ‌మ‌నార్హం.

ముఖ్యమంత్రి కేసీఆర్ కురుమ సామాజికవర్గానికి అన్యాయం చేశారని సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. తమకు ఎలాంటి నామిటెడ్ పదవులు ఇవ్వకుండా.. కేవలం తమ సామాజికవర్గానికి చెందిన ఎగ్గే మల్లేశంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఆయన త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మండిపడుతున్నారు. మొత్తంగా చూస్తే.. శుక్ర‌వారం(14న) నామినేషన్‌ దాఖలు ప్రక్రియ ముగియనుండటంతో కీలక నేతలంతా పూర్తి స్థాయిలో మునుగోడు ప్రచారంలో పాల్గొననున్నారు.