ఇంతర్జంటుగా పవన్ టూర్ ఎందుకో ?

ఇంతర్జంటుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ ఎందుకు పెట్టుకున్నట్లో అర్ధం కావటంలేదు. ఈనెల 15వ తేదీనుండి మూడురోజుల పాటు ఉత్తరాంధ్రలోని వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని నేతలతో సమీక్షలు పెట్టుకున్నారు. 16వ తేదీన ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన జనవాణి కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించబోతున్నట్లు పార్టీ ట్విట్టర్లో ప్రకటించింది. మూడు రోజుల పర్యటనలో పార్టీ నేతలు, శ్రేణులకు పవన్ దిశానిర్దేశం చేయబోతున్నట్లు కూడా పార్టీ ప్రకటించింది.

పవన్ పార్టీ కార్యక్రమాలు పూర్తిగా పవన్ ఇష్టమే అనటంలో సందేహంలేదు. అయితే ఒకపార్టీ డైరెక్టుగా లేదా పరోక్షంగా భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నపుడు సరిగ్గా అదేరోజున మరో పార్టీ కార్యక్రమం నిర్వహించదు. ఒకవేళ నిర్వహిస్తే ఏమైనా గొడవలు వస్తే తర్వాత అది లా అండ్ ఆర్డర్ సమస్యగా మారిపోతుంది. అందుకనే పోలీసులు కూడా రెండో పార్టీ కార్యక్రమానికి అనుమతివ్వరు. ఈ విషయం పవన్ కు బాగా తెలుసు.

తెలిసి కూడా సరిగ్గా 15వ తేదీనుండి వైజాగ్ లోనే మూడు రోజుల కార్యక్రమాలను పెట్టుకున్నారు. దీంతోనే పవన్ కార్యక్రమాలపై అందరిలోను అనామానాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే 15వ తేదీన వైజాగ్ లో జేఏసీ ఆధ్వర్యంలో మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణకు మద్దతుగా భారీ బహిరంగసమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. బహిరంగసభ విజయవంతమయ్యేందుకు వీలుగా ఇప్పటికే ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోను కార్యక్రమాలు జరుగతున్నాయి.

ఇవన్నీ పవన్ కు బాగా తెలుసు. పైగా మూడు రాజధానులకు పవన్ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ఒకవైపు మూడు రాజధానులకు మద్దతుగా భారీ బహిరంగసమావేశం జరుగుతున్న వైజాగ్ లోనే పవన్ అదేరోజు పార్టీ కార్యక్రమం పెట్టుకోవటం వెనుక ఏదో ప్లాన్ ఉన్నదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఓ మూడు రోజులు అయిపోయిన తర్వాత పవన్ తన కార్యక్రమాలను పెట్టుకున్నా జరిగే నష్టమేమీ లేదు. అయినా పంతంకొద్దీ సరిగ్గా 15వ తేదీనుండే తన కార్యక్రమాలను పెట్టుకోవటమే అనుమానాలకు కారణమవుతోంది. మరంత అర్జంటు ఏముందో ?