వ్య‌క్తుల‌పై క‌క్ష‌తో.. వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేస్తారా?: చంద్రబాబు

వ్యక్తులపై కక్షతో ముఖ్యమంత్రి జగన్ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిప‌డ్డారు. అధికారంలో ఉన్నవారు.. వ్యక్తులపై కక్షతో వ్యవస్థలను నాశనం చేయకూడదని, రాష్ట్రంలో జగన్ మొదటి నుంచి ఇదే చేస్తున్నారని మండిపడ్డారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతికి ప్రతిష్ఠాత్మకమైన విట్, ఎస్ఆర్ఎం వంటి విద్యా సంస్థలు వచ్చాయన్నారు.

మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారని అలాంటి సంస్థలు రాజధానిలో ఉండకూడదని కనీసం రోడ్ల సదుపాయం కల్పించకపోవడం దారుణమని దుయ్యబట్టారు. మరమ్మతులు చేయకపోవడం ఎంతటి దారుణమైన మానసిక స్థితి అని ఆక్షేపించారు. విట్, ఎస్ఆర్ఎం సంస్థలకు వెళ్లడానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచించాలని కోరారు.

తమ రాజకీయ లక్ష్యాలు ఏమైనా ఉండొచ్చు…కానీ అవి ఇలా సామాన్యులను సైతం ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని చంద్రబాబు హితవుపలికారు. కాగా, అమ‌రావ‌తిలో ఏర్ప‌డిన ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌లు ఇప్ప‌టికేనిర్మాణాలు పూర్తి చేసుకుని కార్య‌క్ర‌మాలు కూడా ప్రారంభించాయి. అయితే.. ఆయా సంస్థ‌ల‌కు సంబంధించిన మౌలిక స‌దుపాయాలైన ర‌హ‌దారులు, విద్యుత్, తాగునీరు..వంటివి ప్ర‌భుత్వం క‌ల్పించాలి. అవి క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చిన త‌ర్వాత‌.. అవి ఇక్క‌డ ఏర్పాట‌య్యాయి.

అయితే.. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలోనే వాటిని ప్రారంభించారు. కానీ, ఇంత‌లోనే ఎన్నిక‌లు రావ‌డంతో ఆయా ప‌నులు ఎక్క‌డివ‌క్క‌డే నిలిచిపోయాయి. త‌ర్వాత‌.. వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం వాటిని అస‌లు ప‌ట్టించుకోవ‌డం మానేసింది. దీంతో ఇప్పుడు ఆయా సంస్థ‌ల నిర్వ‌హ‌ణ కూడా క‌ష్ట సాధ్యంగా మార‌డంతో.. సంస్థ‌ల‌ను మూసేసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. చంద్ర‌బాబు వైసీపీ స‌ర్కారుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.