ప్ర‌జాద‌ర‌ణ పెరిగింది.. ఓటింగ్ పెరుగుతుందా.. టీడీపీ అంత‌ర్మ‌థ‌నం

ప్ర‌స్తుతం టీడీపీలో నేత‌ల మ‌ధ్య అంత‌ర్మ‌థ‌నం సాగుతోంది. ప్ర‌జాద‌ర‌ణ పెరిగింది. అది పార్టీ అధినేత చంద్ర‌బాబుపై సింప‌తీతో కావొచ్చు.. లేదా.. వైసీపీపై వ్య‌తిరేక‌త‌తో కావొచ్చు. ఈ రెండు కార‌ణాల్లో ఏదైనా.. కూడా పార్టీకి మేలు జ‌రుగుతోంది. ఎక్క‌డికి వెళ్లినా.. ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నారు. ఇది కాద‌న‌లేని స‌త్యం. అయితే.. నాయ‌కులే క‌ద‌ల‌డం లేద‌న్న‌ది.. చంద్ర‌బాబు వాద‌న‌. ఇది కూడా నిజ‌మే. ఇది ఎలా ఉన్న‌ప్ప‌టి కీ.. ప్ర‌జ‌ల్లో మాత్రం మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

టీడీపీ అంటే అభిమానం చూపిస్తున్నారు. టీడీపీ నాయ‌కులు వ‌స్తే.. జై కొడుతున్నారు. త‌మ క‌ష్టాలు చెప్పు కొంటున్నారు. రాజ‌ధాని గురించి కూడా సానుకూలంగా మాట్లాడుతున్నారు. ఇంతా బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఓటుబ్యాంకుపై మాత్రం అంత‌ర్మ‌థ‌నం సాగుతోంది. “అంతా బాగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. కానీ, ఓట్లు ప‌డతాయా? అన్న‌దే ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌గా ఉంది” అని తూర్పు గోదావ‌రికి చెందిన కీల‌క నాయ‌కుడు.. ఒక‌రు మీడియాతో వ్యాఖ్యానించారు.

దీనికి కార‌ణం.. వైసీపీ అనుస‌రిస్తున్న ఉచిత ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల‌కు సానుకూల‌త ఉండ‌డం ప్ర‌ధానంగా టీడీపీని ఇబ్బందికి గురి చేస్తోంది. ఈ విష‌యంలో టీడీపీ అనుస‌రించే వ్యూహాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు ఖ‌రారు చేయ‌లేదు. ప్ర‌స్తుతం వేల‌కు వేలు.. ప్ర‌జ‌ల చేతుల్లో ప‌డుతుండ‌డం.. దీనికి పేద వ‌ర్గాలు కూడా అల‌వాటు ప‌డ‌డంతో .. టీడీపీ అంటే.. అభిమానం ఉన్న‌ప్ప‌టికీ.. తీరా పోలింగ్‌కు వ‌చ్చే స‌రికి ప్ర‌జ‌ల మూడ్ ఎలా ఉంటుంద‌నేది టీడీపీ నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది.

వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లోనూ.. టీడీపీ ప‌సుపు-కుంకుమ ప‌థ‌కం పేరుతో.. 10 వేల రూపాయ‌ల‌ను డ్వాక్రా మ‌హిళ‌ల‌కు పంచారు. అయితే.. ఇది స‌క్సెస్ కాలేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో బారులు తీరిన జ‌నం.. టీడీపీకి షాకిచ్చారు. ఇప్పుడు వైసీపీకి కూడా.. ఇదే ప‌రిస్థితి ఉంటుంద‌నే అంచ‌నాలో టీడీపీ ఉంది. ఎన్ని సంక్షేమ‌ప‌థ‌కాలు అమ‌లు చేసినా.. ప్ర‌జ‌లు త‌మ‌వైపే ఉంటార‌ని.. లెక్క‌లు వేస్తోంది. కానీ, క్షేత్ర‌స్థాయిలో మాత్రం ప్ర‌జ‌ల‌మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో అనే చ‌ర్చ‌కూడా జ‌రుగుతోంది.

ప్ర‌స్తుతం గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇదే విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. తాము క‌నుక ఓడిపోతే.. వేరే ప్ర‌భుత్వం వ‌స్తే.. సంక్షేమ ప‌థ‌కాలు ఆగిపోతాయ‌ని.. ప్ర‌జ‌ల‌కు నూరి పోస్తున్నారు. ఇది కూడా ప్ర‌జ‌ల్లో ఆలోచ‌న‌ను రేకెత్తిస్తోంది. ఒక వ‌ర్గం ప్ర‌జ‌లు అభివృద్ధి కోరుతున్నా.. పేద‌లు.. మ‌హిళ‌లు మాత్రం సంక్షేమానికి ఎడిక్ట్ అయిపోయార‌నేది టీడీపీ నేత‌ల అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లోల ప్ర‌ధానంగా వినిపిస్తున్న మాట‌. ఈ నేప‌థ్యంలో ఏం చేయాల‌నేది వారు ఆలోచిస్తున్నారు. మ‌రి దీనిపై చంద్ర‌బాబు క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.