మునుగోడుపై టీడీపీ వ్యూహం ఇదే!

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం మునుగోడులో ఇప్ప‌టికే మూడు ప్ర‌దాన పార్టీల మధ్య హోరా హోరీ పోరు రెడీ అయిపోయింది. కాంగ్రెస్‌-బీజేపీ-టీఆర్ఎస్‌(బీఆర్ఎస్‌) పార్టీలు.. నువ్వా-నేనా అన్న‌ట్టుగా పోటీ ప‌డుతున్నాయి. గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపు మంత్రాలు ప‌ఠిస్తున్నాయి. ఎలాగైనా.. ఇక్క‌డ పాగావేయాల‌ని.. బీజేపీ.. ప్ర‌య‌త్నిస్తుంటే.. సిట్టింగ్ స్తానాన్ని ద‌క్కించుకునేందుకు కాంగ్రెస్ యుద్ధ‌భూమిలో ప్ర‌యోగాలు చేస్తోంది.

ఇక‌, అధికార పార్టీకి ఈ నియోజ‌క‌వ‌ర్గం చావో..రేవో.. అన్న‌ట్టుగా మారిపోయింది. ఇన్ని ప‌రిణామాల మ‌ధ్య అత్యంత తీవ్ర ఉత్కంఠ‌గా మారిన మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ఉప‌పోరులో.. తెలుగు దేశం పార్టీ(టీడీపీ) కూడా బ‌రిలో దిగేందుకు అస్త్ర శ‌స్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు ఈ ఉప పోరు త‌మ‌కు లాభిస్తుంద‌ని.. పార్టీ నాయ‌కులు త‌ల‌పోస్తున్నారు. ఈ మేరకు పార్టీ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.

అయితే మునుగోడు ఉపఎన్నిక బరిలో ఉండాలా? లేదా? అన్న దానిపై అధిష్టానం నిర్ణయం కోసం స్థానిక నేతలు వేచి చూస్తున్నారు. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలతో సమావేశాన్ని నిర్వహించి, తాజా పరిస్థితులపై చర్చించారు. గతంలో మునుగోడు నియోజకవర్గంలో టీడీపీకి దాదాపు 5వేల సభ్యత్వం ఉంది. మరోసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టి, తమ సత్తా ఏమిటో తేల్చుకుందామని పలువురు నేతలు అధిష్టానంతో చర్చలు జరిపారు.

స్థానిక పరిస్థితులను బట్టి పార్టీ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే టీడీపీ అభిమానులు, సాను భూతిపరులు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారన్న అంశం చర్చనీయాంశమైంది. న‌ల్ల‌గొండ‌లో క‌మ్యూనిస్టుల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. అదేస‌మ‌యంలో గ‌తంలో టీడీపీలో క‌లిసి ప‌నిచేసిన కామ్రెడ్లు.. టీడీపీ వైపు మొగ్గు చూపే అవ‌కాశం ఉంది. అయితే.. గెలుస్తారా? లేదా.. అన్న‌ది ప‌క్క‌న పెడితే.. ప్ర‌ధాన పార్టీల‌కు .. టీడీపీ పోటీ.. జీర్ణించుకోలేని విష‌య‌మ‌ని అంటున్నారు. ఎందుకంటే.. దీనివ‌ల్ల ఓట్లు చీల‌తాయ‌ని అనుకుంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.