రికవరీ రేటులో తెలుగురాష్ట్రాలది బ్యాక్ బెంచ్

కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. వైరస్ కేసులు తెలంగాణలో 28వేలు దాటగా, ఆంధ్రప్రదేశ్‌లో 23వేలకు దగ్గరలో ఉంది. కేసుల్లో దాదాపు టాప్ 10లోనే ఉన్నాయి. టెస్టుల పరంగా తెలంగాణ చాలా బలహీనంగా ఉందనే విమర్శలు ఎదుర్కొంటోంది. రోజు రోజుకు కేసులు పెరగడంతో పాటు రికవరీలో అయితే తెలుగు రాష్ట్రాలు వెనుకంజలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 12,010,593, మరణాలు 548,057 కాగా, రికవరీ 6,951,695గా ఉంది. మన దేశంలో కేసులు 760,761 కాగా, మరణాలు 21,018, రికవరీ 469,366గా ఉన్నాయి.

రాష్ట్రాల పరంగా చూస్తే రికవరీ రేటు ఉత్తరాఖండ్‌లో ఎక్కువగా ఉంది. నేటి ఉదయం వరకు (జూలై 8 బుధవారం) చూస్తే ఈ హిమాలయరాష్ట్రంలో మొత్తం కేసులు 3,230 ఉండగా, రికవరీ 2,621గా ఉంది. చత్తీస్‌గఢ్‌లో కేసులు 3,415 కాగా, రికవరీ 2,751గా ఉంది. లడక్‌లో వెయ్యికి పైగా కేసులు ఉండగా 800 పైగా రికవరీ అయ్యారు. రాజస్థాన్‌లో 21,404 కేసులకు 16,575, హర్యానాలో 18వేల కేసులకు 13,645, మధ్యప్రదేశ్‌లో 15,627 కేసులకు 11,768, బీహార్‌లో 12,570 కేసులకు 9,284, ఢిల్లీలో లక్షకు పైగా కేసులకు 75వేల వరకు రికవరీ అయ్యారు.

గుజరాత్‌లో 37వేల కేసులకు 27వేలు, జార్ఖండ్‌లో 3వేల కేసులకు 2,100, పంజాబ్‌లో ఆరున్నర వేల కేసులకు నాలుగున్నర మంది రికవరీ అయ్యారు. అసోంలో 12వేలకు పైగా, పశ్చిమ బెంగాల్‌లో 23వేలకు పైగా, ఒడిశాలో 10వేలకు పైగా, యూపీలో 30వేలు, జమ్ము కాశ్మీర్‌లో 9వేల కేసులు ఉండగా ఈ రాష్ట్రాల్లో రికవరీ మూడింట రెండొంతులుగా ఉంది.

2,17,121తో అత్యధిక కేసులు ఉన్న మహారాష్ట్రలో సగానికి పైగా, 1,18,594తో అత్యధిక కేసులు ఉన్న తమిళనాడులో 72వేల వరకు రికవరీ ఉంది. మణిపూర్, కేరళలోను చెప్పుకోదగిన రికవరీ రేటు ఉంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికవరీ రేటు మధ్యస్థాయిలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటకలో రికవరీ రేటు సగం కూడా లేదు. ఏపీలో 21,197 కేసులకు 9,745, కర్నాటకలో 26,815 కేసులకు 11,098 మంది రికవరీ అయ్యారు. ఇక తెలంగాణలో 28వేల వరకు కేసులు ఉండగా 16వేలకు పైగా మాత్రమే రికవరీ అయ్యారు. అంటే రికవరీ రేటు అరవై శాతానికి అటు ఇటుగా ఉంది.