రాజ‌కీయాల్లోకి వివేకా కుమార్తె.. ఇంకా క్వ‌శ్చ‌న్ మార్కేనా?

మాజీ మంత్రి, అత్యంత దారుణంగా హ‌త్య‌కు గురైన‌ వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె.. సునీత రెడ్డి.. గురించి ఎప్పుడూ.. వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఆమె రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారని.. పోటీకి రెడీ అవుతున్నార‌ని.. వార్తలు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం.. గ‌తంలో ఒక‌సంద‌ర్భంలో వైసీపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల చేసిన కామెంట్లే. “ఈ ప‌రిణామాలు చూస్తుంటే.. ఆమెను.. రాజ‌కీయాల్లోకి తెచ్చేలా ఉన్నారు” అంటూ.. టీడీపీపై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఎందుకంటే.. అప్ప‌ట్లో టీడీపీ ఈ కేసు విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుని.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించింది. దీంతో స‌జ్జ‌ల కామెంట్లు చేశారు. మ‌రోవైపు.. సునీత .. ఈ కేసు విష‌యాన్ని సీరియ‌స్‌గానే తీసుకున్నారు. ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా.. వ్య‌వ‌హ‌రిస్తున్నారు. హైకోర్టులో సీబీఐకి అప్ప‌గించాల‌ని.. పిటిష‌న్ వేసి.. విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. తాజాగా.. ఈ కేసు విచార‌ణ ముందుకు సాగ‌డం లేద‌ని.. పొరుగు రాష్ట్రాల్లో విచారించేలా .. ఆదేశించాల‌ని కోరుతూ.. సుప్రీం కోర్టుకు వెళ్లారు.

అంటే.. సునీత పోరాటం తీవ్రంగానే ఉంద‌ని అర్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో ఆమెకు కుటుంబం ప‌రంగా ఎలాంటి స‌హ‌కారం లేద‌నేది కూడా వాస్త‌వం. అందుకే.. రాజ‌కీయంగా ముందుకు వ‌స్తే.. ఆమెకు న్యాయం జ‌రుగుతుంద‌ని.. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడా ఉంటుంద‌నే అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అయితే.. దీనిపై ఎక్క‌డా.. వివేకా కుమార్తె.. బ్లాస్ట్ కావ‌డం లేదు. అయితే.. అలాగ‌ని.. ఎక్క‌డా.. ఆమె రాజ‌కీయాల్లోకి రాన‌ని మాత్రం చెప్పడం లేదు.

ఇదిలావుంటే.. సునీత రాజ‌కీయాల్లోకి వ‌స్తానంటే.. ఆహ్వానించేందుకు.. ఏయే పార్టీలు రెడీగా ఉన్నాయ‌నే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. టీడీపీ ముందున్న‌ట్టు తెలుస్తోంది. అదేవిధంగా జ‌న‌సేన కూడా రెడీగానే ఉంద‌నే సంకేతాలు ఇస్తోంది. ఎందుకంటే.. జ‌న‌సేనాని కూడా.. ప‌లు మార్లు ఈ కేసులో సునీత‌కు అన్యాయం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. సో.. ఈ రెండు పార్టీలు కూడా.. సునీత‌ను అక్కున చేర్చుకునేందుకు రెడీగానే ఉన్నాయ‌ని చెప్పొచ్చు. మ‌రి ఏం నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.