నోరుపారేసుకున్న అంబటి ?

అమరావతి పాదయాత్రపై మంత్రి అంబటి రాంబాబు నోరు పారేసుకున్నారు. పాదయాత్ర కాదు ఒళ్ళు బలిసినోళ్ళయాత్ర అంటూ కామెంట్ చేశారు. నిజానికి పాదయాత్రపై ఇప్పటికే రెండు వైపుల నుండి అనేక ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్ళు-ప్రతిసవాళ్ళు ఎగిరెగిరి పడుతున్నాయి. ఇలాంటి సమయంలో మంత్రి పాదయాత్రపై నోరుపారేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక సందర్భాల్లో పాదయాత్రపై చాలామంది మంత్రులు కామెంట్ చేశారు.

అయితే అంబటి లాగ మరీ ఇంత చీపుగా కామెంట్ చేసిన వాళ్ళు లేరనే చెప్పాలి. నిజంగానే పాదయాత్ర ఒళ్ళు బలిసిన వాళ్ళ యాత్రయితే ఆ విషయం జనాలే చూసుకుంటారు. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని అమరావతి జేఏసీ అండ్ కో ఆధ్వర్యంలో పాదయాత్ర జరుగుతోంది. వీళ్ళ వాదన సబబుగా ఉంటే జనాలు ఆమోదిస్తారు. లేదనుకుంటే ఎన్ని పాదయాత్రలు చేసినా జనాలు పట్టించుకోరు.

రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల్లోని జనాలకు అమరావతి రాజధాని లేదా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్టుపై ఒక అవగాహన వచ్చేసింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో బహుశా ఇదే కీలకమైన పాయింట్ గా మారుతుందేమో. అప్పుడు జనాలు తమ మద్దతు ఎవరికనేది స్పష్టంగా చెప్పేస్తారు. ఇంతలోనే రెండు వైపుల నుండి వివాదాలను రాజేసుకోవాల్సిన అవసరం లేదు. మొన్న గుడివాడలో అమరావతి రైతులకు మద్దతుగా వచ్చిన కొందరు ఓవర్ యాక్షన్ చేశారు. తమ యాత్రేదో తాము చేసుకోకుండా కొడాలి నాని ఇంటిముందు తొడలు కొట్టడాలు, చెప్పులు చూపించడాలు, బూట్లు విసిరేయటం అనవసరం.

ఇటు ప్రభుత్వం అయినా అటు అమరావతి మద్దతుదారులైనా ఎంత గొంతు చించుకున్నా జనాల నిర్ణయంలో మార్పేమీ ఉండదు. తమకు ఏది లాభదాయకమని జనాలు అనుకుంటారో దానివైపే మొగ్గుచూపుతారు. సరే పాదయాత్రలో వాళ్ళు ఎవరో ఏదో చేశారని అనుకున్నా మంత్రులు ఇంత అతిగా స్పందించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇపుడు అంబటి చేసిన వ్యాఖ్యలు చాలా ఓవర్ గా ఉంది. ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది.