కేసీయార్ మధ్యలో ఇరుక్కుపోయారా ?

జాతీయ రాజకీయాల్లో పాపులర్ అయిపోవాలని, చక్రం తిప్పాలని కేసీయార్ కు చాలా బలమైన కోరికుంది. రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కోరుకోవటంలో తప్పులేదు. అయితే అందుకు సమయం, సందర్భం, వాతావరణం కలిసొస్తుందా లేదా అనేది చూసుకోకుండానే అడుగులు వేయటమే కేసీయార్ చేసిన తప్పు. ఈ రోజుకు నరేంద్రమోడీ నాయకత్వంలో ఎన్డీయే చాలా బలంగా ఉంది.

ఇదే సమయంలో ప్రతిపక్షమైన మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ పడుతూ లేస్తోంది. కాంగ్రెస్ మినహా మిగిలిన ప్రతిపక్షాలన్నీ ప్రాంతీయ పార్టీలే. అంటే ఎన్డీయేకి నాయకత్వం వహిస్తున్న బీజేపీని ఢీకొనేంత సీన్ ప్రతిపక్షాల్లో దేనికీలేదు. ప్రతిపక్షాలు ఎన్నున్నా జాతీయ పార్టీ కాంగ్రెస్ ను కలుపుకోకుండా బీజేపీని ఎదుర్కునే అవకాశం లేదు. అందరికీ తెలిసిన విషయంలో కూడా కేసీయార్ తప్పటడుగు వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తో ఉన్న వైరం కారణంగా జాతీయ స్ధాయిలో కాంగ్రెస్ లేని పార్టీలన్నింటినీ ఏకం చేయాలని కేసీయార్ ప్రయత్నించారు.

ఇలాంటి ప్రయత్నాలే మమతాబెనర్జీ, నితీష్ కుమార్ కూడా చేస్తున్నారు. అంటే ఒకే విధమైన ప్రయత్నాలను ముగ్గురు సీఎంలు చేస్తున్నారు. వీరిలో మిగిలిన ఇద్దరితో పోలిస్తే నితీష్ కుమార్ కు క్రెడిబులిటి ఉంది. దీనికి అదనంగా మొన్నటివరకు కాంగ్రెస్ తో చేతులు కలిపేదే లేదని చెప్పిన మమత తాజాగా తన స్టాండ్ మార్చుకున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చొరవ కారణంగా కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు మమత అంగీకరించారు.

నితీష్ ఎలాగూ కాంగ్రెస్ ఇపుడు మిత్రపక్షమే. అంటే కాంగ్రెస్ విషయంలో మమత, నితీష్ సానుకూలంగా ఉండగా కేసీయార్ మాత్రమే వ్యతిరేకంగా ఉన్నారు. దాంతో మిగిలిన ప్రతిపక్షాలన్నీ కేసీయార్ ను వదిలేసి మమత, నితీష్ ప్రయత్నాలకు మద్దతుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ ను దూరంపెట్టాలనే కోరిక కేసీయార్లో తప్ప మరే ప్రతిపక్షంలోను లేదు. మారిన పరిస్ధితుల్లో కాంగ్రెస్ తో చేతులు కలపలేక, అలాగని మిగిలిన పార్టీలను ఏకం చేయలేక కేసీయార్ మధ్యలో ఇరుక్కుపోయారు.