ర‌హ‌దారుల కోసం.. మ‌హిళా ఎమ్మెల్యే రోడ్డుమీదే స్నానం

ఏపీలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయ‌ని.. వాటికి క‌నీసం మ‌ర‌మ్మ‌తులు కూడా చేయ‌డం లేద‌ని.. కొత్త రోడ్ల మాట ఎలా ఉన్నా.. క‌నీసం గుంత‌లైనా పూడ్చాల‌ని.. రాజ‌కీయ నాయ‌కులు.. స్వ‌చ్ఛంద సంస్థ‌ల నిర్వాహ‌కులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక‌, ఆటోవాళ్లు.. విద్యార్థులు.. గ్రామ‌స్థులు.. చందాలు వేసుకుని.. మ‌రీ కొన్ని చోట్ల ర‌హ‌దారులు బాగుచేసుకున్న ప‌రిస్థితిని మ‌నం గ‌మ‌నించాం. ఇక‌, జన‌సేన నాయ‌కులు.. వినూత్న నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు.

అయితే.. ఇప్పుడు ఏపీ ఒక్క‌టే కాదు.. మ‌రో రాష్ట్రంలోనూ ఇలానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏకంగా ఓ మ‌హిళా ఎమ్మెల్యే రోడ్డు మీద స్నానం చేసి.. మ‌రీ.. రోడ్డు కోసం.. నిర‌స‌న తెలిపిన ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో తెగ‌ వైర‌ల్ అయింది. జాతీయ రహదారికి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళా శాసనసభ్యురాలు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు.

133 వ నంబరు జాతీయ రహదారికి మరమ్మతులు చేపట్టాలని జార్ఖండ్ రాష్ట్రంలోని గొడ్డా మహిళా ఎమ్మెల్యే దీపికాపాండే సింగ్ పలు సార్లు జాతీయ రహదారుల విభాగం అధికారులకు విన్నవించారు. నేషనల్ హైవే అధ్వానంగా మారడంతోపాటు వర్షం కురిస్తే చాలు బురదనీరు రోడ్డుపైనే నిలుస్తోంది. రోడ్డుకు మరమ్మతులు చేపట్టక పోవడం వల్ల ప్రతీరోజూ ఈ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

అయినా కేంద్ర నేషనల్ హైవే విభాగం అధికారులు పట్టించుకోక పోవడంతో బుధవారం ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ బురదనీటిలో దిగి స్నానమాచరించి నిరసన తెలిపారు. జాతీయ రహదారికి మరమ్మతు పనులు చేపట్టేవరకూ తాను బురదనీటిలో నుంచి బయటకు రానని ఎమ్మెల్యే దీపికా బీష్మించుకు కూర్చున్నారు. బురద నీటిలో మహిళా ఎమ్మెల్యే స్నానం చేస్తూ.. వినూత్న నిరసన తెల‌ప‌డంతో ప్రజలు, అధికారులు తరలివచ్చారు.