మూడేళ్ల‌లో జ‌గ‌న్ దోపిడీ 2 ల‌క్ష‌ల కోట్లు: నారా లోకేష్

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ యువ నాయ‌కుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడ్డా రు. గ‌డిచిన మూడేళ్ల పాల‌న‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌జాధ‌నాన్ని దోచేశార‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. దీని విలువ దాదాపు 2 ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని చెప్పారు. తాజాగా బుధ‌వారం ఉద‌యం.. నారా లోకేష్ ఆధ్వ‌ర్యంలో టీడీపీ శాసనసభ పక్షం నిరసన తెలిపింది. రాష్ట్రంలో స‌హ‌జ వ‌నరులైన‌.. భూమిని, ఇసుక‌ను.. వైసీపీ నాయ‌కులు దోచేస్తున్నారంటూ.. నేత‌లు నిర‌స‌న‌కు దిగారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘అవినీతిలో ఏ-1 జగన్ రెడ్డి ‘ అని నాయ‌కులు నినాదాలతో హోరెత్తించారు. లేపాక్షి భూములు జగన్ కుటుంబం కబ్జా చేస్తే, ఖాళీ స్థలాలను వైసీపీ ల్యాండ్ మాఫియా కబ్జా చేస్తోందని ఆరోపించారు. “జగన్ రెడ్డి స్కాం రెడ్డి గా మారి, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు” అని నారా లోకేష్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

భూ, ఇసుక, మద్యం, మైన్స్, బియ్యం దోపిడీకి వైసీపీ నేతలు పాల్పడుతున్నారంటూ అసెంబ్లీకి కాలినడకన వెళ్లి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇసుకను మింగేస్తున్న వైసీపీ ఇసుకాసురులు అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. ‘జే బ్రాండ్స్’తో జగన్ రెడ్డి పేదల రక్తం తాగుతున్నారని నినాదాలు చేశారు.

‘జగన్ వాకిట్లో గంజాయి చెట్లు’, ‘సెంటు భూమి పేరుతో ప్రజాధనం లూటీ’ అనే ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. మైనింగ్ మాఫియా డాన్ గా జగన్ రెడ్డి ఉంటే, వైసీపీ నేతలు రేషన్ బియ్యం కొట్టేస్తున్నారని నారా లోకేష్ స‌హా ఇత‌ర‌ నేతల మండిప‌డ్డారు. ఎర్ర చందనాన్ని వైసీపీ నేతలు ఏటిఎంగా మార్చుకున్నారని నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో అసెంబ్లీ ప్రాంగ‌ణం ఉద్రిక్తంగా మారింది. ఒకానొక ద‌శ‌లో నేత‌లు.. అసెంబ్లీని ముట్ట‌డిస్తార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. దీంతో హుటాహుటిన స్పందించిన పోలీసులు.. భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.