సంక్ష‌మం చాల‌దు.. భావోద్వేగ‌మే బెట‌ర్‌.. వైసీపీ వ్యూహం ఇదేనా?

ఇప్ప‌టి వ‌ర‌కు సంక్షేమాన్ని న‌మ్ముకుని.. ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని అనుకున్న ఏపీ స‌ర్కారు వ్యూహం మార్చి నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. సంక్షేమం ఒక్క‌టే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గ‌ట్టెక్కించే ప‌రిస్థితి లేద‌ని.. పార్టీ నాయ‌కులు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌లు.. ఏపీలో గ‌త ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. సంక్షేమం ఒక్క‌టే ప్ర‌భుత్వాల‌ను నిల‌బెట్టిన ప‌రిస్థితి లేదు. ప్ర‌జ‌ల‌ను మెప్పించాలంటే.. అభివృద్ధిని కూడా జోడించాలి. అయితే.. ‘ఆ ఒక్క‌టీ త‌ప్ప‌!’ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే వాద‌న ఉంది.

నిజానికి ఆది నుంచి కూడా ఎవ‌రు అభివృద్ధి గురించి ప్ర‌స్తావ‌న తెచ్చినా.. తాము సంక్షేమానికి పెద్ద‌పీట వేస్తున్నామ‌ని.. సంక్షేమ రాజ్యం స్తాపిస్తున్నామ‌ని.. వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. సంక్షేమం ప్ర‌జ‌ల్లో ఎంత మందికి అందుతోంది? అంటే.. కేవ‌లం 15 శాతం మంది ప్ర‌జ‌లకు మాత్ర‌మే అందుతోందనే ది ప్ర‌భుత్వం చేయించిన స‌ర్వేల్లోనే స్ప‌ష్టంగా తేలింద‌ని వైసీపీ నాయ‌కులేచెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తిరుగుతున్న నాయ‌కుల‌ను కూడా ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు.

పైగా.. మెజారిటీ ప్ర‌జ‌లు క‌డుతున్న ప‌న్నుల‌తో కొంద‌రికే సంక్షేమం అందిస్తూ.. ఉండ‌డం.. మెజారిటీ ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన ర‌హ‌దారులు.. మౌలిక స‌దుపాయాలు.. వంటివాటిని ప్ర‌భుత్వం విస్మ‌రించ‌డంపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక‌, లెక్కకు మిక్కిలి కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసినా.. వాటిని నిధులు ఇవ్వ‌క‌పోవ‌డంతో అవి కూడా ఆశించిన విధంగా ఫ‌లితం ఇచ్చేలా లేవ‌ని.. వైసీపీ నాయ‌కులు బాహాటంగా నే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో అన్ని కోణాల్లోనూ ఆలోచించిన వైసీపీ అధిష్టానం.. సంక్షేమంతోపాటు భావోద్వేగాన్ని కూడా న‌మ్ముకుందామ‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు వైసీపీ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు. అంటే.. ప్ర‌స్తుతం మూడు రాజ‌ధానుల అంశాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లి.. ప్రాంతాల వారిగా ప్ర‌జ‌ల్లో సెంటిమెంటును ర‌గిలించి.. త‌ద్వారా.. ల‌బ్ధి పొందాల‌నే వ్యూహంతో ఉంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో ఎన్ని పార్టీలు వ‌చ్చినా.. ఇదే స‌వాల్ రువ్వ‌డం ద్వారా.. ప్ర‌జ‌లను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టు వైసీపీ కీల‌క నేత‌లే ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.