‘మీ రాజ‌ధాని ఏదంటూ మా అమ్మాయిని ఆట‌ప‌ట్టిస్తున్నారు’

ఏపీ రాజ‌ధాని అంశం.. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. ఏపీకి రాజ‌ధాని ఏదీ.. అంటూ.. ఇటీవ‌ల‌.. ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు నెట్ చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. దీంతో రాజ‌కీయంగా కూడా ఇది అప్ప‌ట్లో దుమారం రేపింది. ఒక‌.. క్యాంప‌స్‌లో ప్ర‌సంగించేందుకు వైసీపీ ఎంపీ వెళ్లిన సంద‌ర్భంగా.. అక్క‌డి విద్యార్థులు.. ‘మూడు రాజ‌ధానుల‌తో అభివృద్ధి సాధ్య‌మేనా?’ అని ప్ర‌శ్నించ‌డం కూడా వైసీపీని ఇర‌కాటంలో ప‌డేసింది.

ఇలా.. ఈ ఒక్క సంద‌ర్భ‌మే కాదు.. ఏపీ రాజ‌ధాని గురించి.. అనేక రూపాల్లో విమ‌ర్శ‌లు.. వివాదాలు వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా త‌న కుటుంబంలోని త‌న కుమార్తెకు జ‌రిగిన అవ‌మానంపైనా.. టీజింగ్ పైనా.. ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయ‌మూర్తి.. జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్ తీవ్ర ఆవేద‌న.. ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తెలుగు జాతి అంటే చులకన అయిపోయింది అని జస్టిస్ బట్టు దేవానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతరరాష్ట్రాల వారి దగ్గర అవమానాలు పొందే పరిస్థితిలో మనం ఉన్నామన్నారు.

“మనలో ఐక్యత లేదు, ప్రతిదానికి కులం, రాజకీయం, స్వార్థం. మా కుమార్తె ఢిల్లీలోని ఓ కాలేజీలో చదువుతోంది. మా కుమార్తెను తోటి విద్యార్థులు మీ రాజధాని ఏదంటూ ఆట పట్టిస్తున్నారు. పిల్లలు కూడా తలదించుకునే స్థితిలో మనం ఉన్నాం. ఇలాంటి అవలక్షణాలను మార్చాల్సిన బాధ్యత రచయితలపై ఉంది. ప్రజలను చైతన్య పరిచే శక్తి కవులకు మాత్రమే ఉంది” అంటూ జస్టిస్ బట్టు దేవానంద్ తెలిపారు. తెలుగు రచయితల సంఘం పుస్తకావిష్కరణ సభలో హైకోర్టు జడ్జి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

ఒక్క న్యాయ‌మూర్తే కాదు.. ఇంజ‌నీరింగ్ రంగ నిపుణులు.. వైద్య‌రంగ నిపుణులు కూడా ఇదే ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. “రాష్ట్రానికి కేరాఫ్ లేదా?” అని ఖ‌ర‌గ్ పూర్ విద్యార్థి ఒక‌రు.. ఏపీ విద్యార్థుల‌ను ప్ర‌శ్నించిన వీడియో కొన్నాళ్ల కింద‌ట వైర‌ల్ అయింది. ఇలా.. ఒక్క‌టేమిటి.. ఏపీ రాజ‌ధాని విష‌యంలో త‌లెత్తుతున్న అనేక వివాదాలు.. విమ‌ర్శ‌లు త‌ర‌చుగా.. తెర‌మీదికి వ‌స్తూనే ఉన్నాయి. ఈ ప‌రంప‌ర‌లో.. న్యాయ‌మూర్తి జ‌స్టిస్ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి.