ఆ హామీనే ఇపుడు జగన్ మెడకు చుట్టుకుందా ?

అనాలోచితంగా అప్పట్లో ఇచ్చిన హామీనే ఇపుడు వైసీపీ మెడకు చుట్టుకుంది. ఇంతకీ ఆ హామీ ఏమిటంటే సీపీఎస్ రద్దు. రిటైర్ అయిన ఉద్యోగులకు వర్తింపచేసే పెన్షన్ పద్దతిని 2004లో కేంద్రప్రభుత్వం మార్చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్) బదులుగా కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) అమల్లోకి వచ్చింది. అయితే కేంద్రం రాష్ట్రాలకు ఒక వెసులుబాటు ఇచ్చింది. అదేమిటంటే ఆయా రాష్ట్రాల పరిస్ధితులను బట్టి ఓపీఎస్ కానీ లేదా సీపీఎస్ కానీ దేన్నైనా అమలు చేయచ్చని.

ఈ వెసులుబాటు కారణంగా కొన్ని ప్రభుత్వాలు సీపీఎస్ విధానాన్ని అమల్లోకి తెచ్చాయి. కొన్ని రాష్ట్రాలేమో ఓపీఎస్ విధానాన్నే కంటిన్యు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీలో సీపీఎస్ అమల్లోకి వచ్చింది. అప్పట్లో ఏమీ మాట్లాడని ఉద్యోగులు తాజాగా తమకు ఓపీఎస్ విధానమే కావాలని, సీపీఎస్ వద్దంటు డిమాండ్లు మొదలుపెట్టారు. 2019 ఎన్నికలకు ముందు ఉద్యోగసంఘాలు తమ డిమాండును తెరపైకి తెచ్చారు. తమ డిమాండుతో ఉద్యోగుల నేతలు అన్నీపార్టీల అధినేతలతో భేటీ అయ్యారు.

అయితే ఉద్యోగుల భేటీలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఎలాంటి హామీలు ఇవ్వలేదు. కానీ పాదయాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లోనే సీపీఎస్ రద్దుచేస్తానని ప్రకటించారు. నిజానికి జగన్ ఇచ్చిన హామీ పూర్తిగా అనాలోచితమే. సమస్య లోతు తెలుసుకోకుండా, రాష్ట్ర ఆర్ధికపరిస్ధితి చూసుకోకుండా జగన్ హామీ ఇవ్వటం తప్పే. అప్పట్లో నోటికొచ్చిన హామీ ఇచ్చేశారు తర్వాత ఎన్నికల్లో గెలిచారు.

అప్పట్లో అనాలోచితంగా ఇచ్చిన హామీనే ఇపుడు జగన్ మెడకు చుట్టుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాతే అర్ధమైంది ఉద్యోగుల డిమాండ్ తీర్చటం సాధ్యంకాదని. ఇదే విషయం ప్రభుత్వం ఉద్యోగులతో చెప్పటంతోనే గొడవలు జరుగుతున్నాయి. సీపీఎస్ రద్దుచేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు. అందుకనే మధ్యేమార్గంగా గ్యారెంటీ పెన్షన్ స్కీం (జీపీఎస్) అమలుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే జీపీఎస్ వద్దని సీపీఎస్ రద్దుచేసేంత వరకు ఆందోళనలు చేస్తుంటామని ఉద్యోగులు చెబుతున్నారు. అప్పట్లో ఇచ్చిన హామీయే ఇపుడు జగన్ మెడకు చుట్టుకుంది.