కువైట్: 8 లక్షల మంది ఎన్నారైలకు నరకం

కువైట్ భారతీయులకు, భారత ప్రభుత్వానికి అనూహ్యమైన షాక్ ఇచ్చింది. సగం ఇండియన్లను దేశం నుంచి తరిమేసే ఉద్దేశంతో రూపొందించిన బిల్లును కువైట్ జాతీయ అసెంబ్లీ శాసనసభ కమిటీ ఆమోదించింది. దీని ఫలితంగా 8 లక్షల మంది భారతీయులు దేశం విడిచి వెళ్ళకతప్పదు. ఈ బిల్లు ప్రకారం, భారతీయులు కువైట్ జనాభాలో 15 శాతానికి మించరాదు. ప్రస్తుతం అక్కడ 30 శాతానికి పైగా ఇండియన్లు ఉన్నారు.

ఈ బిల్లు కారణంగా ఆ దేశంలో స్థిరపడిన మొత్తం 14.5 లక్షల భారీతయ జనాభాలో 800,000 మంది భారతీయులు కువైట్ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటందని స్థానిక మీడియా పేర్కొంది.

కువైట్ మొత్తం 4.3 మిలియన్ల జనాభాలో ఇమ్మిగ్రెంట్స్ సంఖ్య 3 మిలియన్లు. అంటే 70 శాతం విదేశీయులు, 30 స్వదేశీయులు కువైట్లో నివసిస్తున్నారు. గత నెలలో, కువైట్ ప్రధాన మంత్రి షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబా, జనాభాలో 70 శాతం నుండి 30 శాతానికి నిర్వాసితుల సంఖ్యను తగ్గించాలని చేసిన ప్రతిపాదన మేరకు ఈ బిల్లును రూపొందించి ఆమోదించారు. ఈ బిల్లు మరిన్ని దశలు దాటాల్సి ఉంది.అయితే… దీనికి స్థానిక రాజకీయ మద్దతు కూడా ఉండటంతో ఈ బిల్లు అమలులోకి రావడం గ్యారంటీ.

విచారకరం ఏంటంటే… ఇది కరోనా తెచ్చిన ముప్పే. కరోనా కారణంగా ఆ దేశంలో ఉపాధి బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కడానికి విదేశీయులపై పడ్డారు. పైగా అత్యధికంగా ఉండే భారతీయులను పంపించేస్తే తమ ఉద్యోగాలు తమకు వస్తాయన్న సెంటిమెంట్ కూడా స్థానిక ప్రజల్లో బలంగా ఉందట. తాజా అంచనాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 49,000 కి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.