వారంలో మ‌రో వెయ్యి కోట్లు.. ఏపీకి అప్పే ఆధార‌మా?

ఏపీ ప్ర‌భుత్వం కేవ‌లం వారం వ్య‌వ‌ధిలోనే మ‌రో వెయ్యి కోట్లు అప్పు చేసింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించడమే లక్ష్యంగా పనిచేస్తున్న వైసీపీ ప్రభుత్వం.. ఈ వారం కూడా ఆర్‌బీఐ నుంచి రూ.1,000 కోట్ల అప్పు తెచ్చింది. మంగళవారం రాష్ట్ర సెక్యూరిటీల వేలంలో పాల్గొని 7.58 శాతం వడ్డీకి ఈ అప్పు తీసుకుం ది. ఇందులో రూ.500 కోట్ల అప్పు కాలపరిమితి 18 ఏళ్లు కాగా.. మరో రూ.500 కోట్ల అప్పు కాలపరిమితి 20 ఏళ్లు. దీంతో ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రప్రభుత్వం చేసిన అప్పు రూ.48,100 కోట్లకు చేరుకుంది.

ప్ర‌స్తుతం ఆర్థిక సంవ‌త్స‌రంలో గ‌డిచిన‌ 5 నెలల్లో ఆర్‌బీఐ నుంచి ఏపీ ప్ర‌భుత్వం రూ.37,890 కోట్లు తీసుకు వ‌చ్చింది. అయితే.. అంత‌టితో ప్ర‌భుత్వం స‌రిపుచ్చ‌లేదు. నాబార్డు నుంచి రూ.390 కోట్లు, కేంద్రం నుంచి ఈఏపీ కింద రూ.1,680 కోట్లు.. జూన్‌లో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా ఎన్‌సీడీలు జారీ చేసి రూ.8,300 కోట్ల అప్పులు తెచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 44,574 కోట్ల అప్పులకు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే.. ఇప్ప‌టికే ఈ ప‌రిమితి దాటిపోయింది. అయిన‌ప్ప‌టికీ.. అప్పులు ఎలా వ‌స్తున్నాయ‌నేది ప్ర‌శ్న‌.

ఈ విష‌యంలోనే స‌ర్కారు తెలివిగా వ్య‌వ‌హ‌రించింది. ప్ర‌భుత్వ ఉద్యోగులు త‌మ‌కు గుదిబండ‌గా మారిందని చెబుతున్న‌ సీపీఎస్‌ను ర‌ద్దు చేయ‌కుండా.. దానిని కొనసాగిస్తే మ‌రో రూ.4,203 కోట్లు అదనంగా అప్పు తెచ్చుకునే అవకాశం ఏపీకి ల‌భించింది. దీంతో ఉద్యోగులు ఎన్ని ఉద్య‌మాలు చేసినా.. ప్ర‌భుత్వం మ‌న‌సు మాత్రం క‌ర‌గ‌డం లేదు. సీపీఎస్‌ను ర‌ద్దు చేసేది లేద‌ని.. భీష్మించింది. దీంతో ఉద్యోగుల‌కు స‌ర్కారుకు మ‌ధ్య వివాదం ముదురుతూనే ఉంది.

ఇదిలావుంటే, సీపీఎస్ కొన‌సాగింపును కూడా పరిగణనలోకి తీసుకుంటే అప్పుల పరిమితి రూ.48,777 కోట్లకు చేరుతుంది. ఇంకా సీపీఎస్‌ రద్దు చేయలేదు కాబట్టి ఈ అప్పుల పరిమితినే పరిగణనలోకి తీసుకుంటే ఇంకా రాష్ట్రానికి రూ.677 కోట్ల అప్పులు చేసే వెసులుబాటు మాత్రమే ఉంటుంది. కానీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి తెచ్చిన అప్పు రూ.8,300 కోట్లను జగన్‌ ప్రభుత్వం అప్పుల పరిమితిలో చూపకుండా దాచిపెడుతోంది. దీనిని క‌నుక క‌లిపి లెక్కిస్తే.. స‌ర్కారుకు ఇక‌, అన్ని దారులు మూసుకుపోయిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.