పార్లమెంటులో కరిచే కుక్కలు ఉన్నాయి – కాంగ్రెస్ ఎంపీ

కరిచే కుక్కలు లోపల ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నిన్న ఆమె పార్లమెంటుకు తన కారులో ఒక శునకాన్ని తీసుకువచ్చారు. గమనించిన భద్రతా సిబ్బంది ఆమె కారును నివాసానికి తిరిగి పంపారు. ఈ సందర్భంలో ఆమె కొంత వివరణ ఇచ్చారు. తాను ఆ కుక్కపిల్ల కనిపించిందని, రోడ్డు ప్రమాదం నుంచి రక్షించి, పార్లమెంట్‌కు వచ్చానని అన్నారు.

వెంటనే వెనక్కి పంపించినట్లు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. కుక్కపిల్ల సమస్య కాదు, నిజంగా కరిచే మనుషులు పార్లమెంట్ లోపల ఉన్నారు.. అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తన చర్యను వివరిస్తూ, ‘ఏ ప్రోటోకాల్? దీనికి సంబంధించి ఏమైనా చట్టం ఉందా?’ అని ప్రశ్నించారు. ఆ కుక్క ఎవరికీ హాని చేయదని, అది కేవలం కారులో తనతో పాటు ప్రయాణించిందని తెలిపారు. దీనిపై బీజేపీ భగ్గుమంది.

రేణుక తీరుపై బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పార్లమెంట్ ను, ఎంపీలను అవమానించడమేనని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. రేణుక తన సహచర ఎంపీలందరినీ కుక్కలతో పోల్చారని, కాంగ్రెస్ పార్టీ చర్చలు కాకుండా డ్రామాలు కోరుకుంటోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు.

కాంగ్రెస్ కు రాజ్యాంగ సంస్థలపై గౌరవం లేదని, రేణుకా చౌదరి దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాజ్యసభ తనపై ప్రివిలేజ్ మోషన్ తీసుకురావాలనే సమాచారం నేపథ్యంలో రేణుకా చౌదరి స్పందించారు. ఇదే విషయాన్ని మీడియా అడగ్గా “తీసుకురాగానే చూస్తాను… తగిన సమాధానం ఇస్తాను” అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె భౌ భౌ’ అంటూ మీడియా ముందు రిప్లై ఇచ్చారు.