బ్రహ్మాస్త్ర ఈవెంట్ రద్దు వెనుక రాజకీయం?

బ్రహ్మాస్త్ర సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రద్దవటం సంచలనంగా మారింది. ఈ సినిమా ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ జూనియర్ ఎన్టీయార్ కావటంతో జనాల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన ఫంక్షన్ ను పోలీసులు చివరి నిముషంలో రద్దుచేశారు. ముందుగానే ఫంక్షన్ కు సినిమా యూనిట్ అనుమతి తీసుకున్నది. శుక్రవారం సాయంత్రం జరగాల్సిన ఫంక్షన్ కు గురువారం రాత్రి పోలీసులు అనుమతిని రద్దుచేశారు.

సినిమా ఫంక్షన్ కు అనుమతులు ఇవ్వడం మళ్ళీ రద్దు చేయడం మామూలుగా జరిగేదే. కానీ ఇక్కడ రద్దయిన ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ జూనియర్ కావటంతోనే వివాదం పెద్దదయిపోయింది. సినిమా ఫంక్షన్ను కూడా కేసీయార్ ప్రభుత్వం రాజకీయంగా చూస్తున్నదా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఈమధ్యనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో జూనియర్ భేటీ అయిన విషయం తెలిసిందే. వీళ్ళ భేటీకి ముందు అమిత్ షా రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ ఇంటికి వెళ్ళొచ్చారు.

అంటే అమిత్ ఇటు రామోజీ అటు జూనియర్ తో ఒకేరోజు భేటీ అవ్వటం రాజకీయంగా బాగా హీటెక్కించింది. ఈ రెండు భేటీలు కచ్చితంగా బీజేపీకి అనుకూలంగా ఉండటం కోసమే జరిగిందనే ప్రచారం అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో జూనియర్ ను బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేయమని అమిత్ అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. జూనియర్ సమాధానం ఏమిటనేది తెలీకపోయినా రాజకీయంగా మంటలు మాత్రం పెరిగిపోతున్నాయి.

ఇపుడు జూనియర్ ఫంక్షన్ను కేసీయార్ ప్రభుత్వం నూరుశాతం రాజకీయంగా చూస్తున్నది కాబట్టే సినిమా ఫంక్షన్ కు అనుమతిచ్చినట్లే ఇచ్చి ప్రభుత్వం మళ్ళీ క్యాన్సిల్ చేసిందనే ఆరోపణలు, ప్రచారం పెరిగిపోతోంది. పోలీసులు ముందు అనుమతి ఎందుకు ఇచ్చారో చివరినిముషంలో ఎందుకు రద్దుచేశారో వాళ్ళకే తెలియాలి. ఏదేమైనా ఫంక్షన్ ప్రోగ్రామ్ రద్దవటం మాత్రం రాజకీయంగా మంటలు రేపుతోంది.