నిన్న జయరాజ్-ఫీనిక్స్.. నేడు శశికళ.. అట్టుడుకుతున్న తమిళనాడు

Tamilnadu

దేశమంతా కరోనాతో అల్లాడుతోందిప్పుడు. వైరస్ ప్రభావం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్ర తర్వాత లక్ష కరోనా కేసులు దాటిన రాష్ట్రం అదే. ఐతే ఇప్పుడు అక్కడ చర్చనీయాంశం కరోనా కాదు. శశికళ అనే అమ్మాయికి జరిగిన అన్యాయంపై ఇప్పుడు ఆ రాష్ట్రం అట్టుడుకుతోంది.

రెండు వారాల కిందట పోలీసుల దాష్టీకానికి బలైన జయరాజ్-ఫీనిక్స్ కేసు తమిళనాడును ఒక కుదుపు కుదిపేయగా.. దాని తాలూకు మంటలు చల్లారకుండానే ఇప్పుడు ఓ కొత్త కేసు ఆ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది. 22 ఏళ్ల శశికళ అనే అమ్మాయి పట్ల ఇద్దరు సోదరులు దారుణాతి దారుణంగా వ్యవహరించి.. ఆమె ఆత్మహత్యకు కారణమైన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నాలుగేళ్ల కిందట ఈ అమ్మాయి స్నానం చేస్తుండగా.. ఆ ఇద్దరు సోదరులు వీడియో తీశారు. దాన్ని చూపించి బ్లాక్‌మెయిల్ చేసి ఆమెను లొంగదీసుకున్నారు. నాలుగేళ్ల పాటు ఆ ఇద్దరూ ఆ అమ్మాయిపై అత్యాచారం చేస్తూ వచ్చారు. చివరికి వీరి బాధ తాళలేక జూన్ 24న ఆ అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ముందు ఆ అమ్మాయి ఎందుకా అఘాయిత్యం చేసిందో అర్థం కాలేదు.

ఐతే నెమ్మదిగా అసలు విషయం బయటికి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు సోదరుల్లో ఒకరు ప్రతిపక్ష డీఎంకే పార్టీకి చెందిన నాయకుడని తేలింది. ఈ ఇద్దరు సోదరులూ ఇప్పుడు పరారీలో ఉన్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు తమిళనాట రాజకీయంగా కూడా ప్రకంపనలు రేపుతోంది.

సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. శశికళకు న్యాయం జరగాలని సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. సాయిపల్లవి, వరలక్ష్మి శరత్‌కుమార్ సహా ఎంతోమంది ఫిలిం సెలబ్రెటీలు ఈ ఉదంతంపై తీవ్ర వేదనతో మెసేజ్‌లు పోస్ట్ చేశారు.