రామోజీతో భేటీ.. జూనియ‌ర్‌తో డిన్న‌ర్‌..

తెలంగాణ‌లోని కీల‌క‌మైన మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి.. నిర్వ‌హించి సభ నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులతో భేటీ అవ్వాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మునుగోడు సభ ముగించుకున్న అమిత్‌షా కాసేపట్లో రామోజీ ఫిల్మ్‌ సిటీకి వెళ్లారు. ఫిల్మ్‌సిటీలో రామోజీరావుతో అమిత్‌షా భేటీ అయ్యారు. మర్యాదపూర్వక భేటీనేనని బీజేపీ చెబుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగిన‌ట్టు తెలిసిసంది.

దాదాపు 45 నిమిషాల పాటు రామోజీ రావు, అమిత్‌షా భేటీ జ‌రిగింది. ఫిలింసిటీలోని ప్రెసిడెన్సీ లాంజ్‌లో అమిత్‌షాకు రామోజీరావు, ఆయ‌న కుమారుడు కిర‌ణ్‌కుమార్‌.. త‌దిత‌రులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం.. రామోజీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న `ఓం సిటీ`కి అమిత్‌షాను స్వ‌యంగా తీసుకు వెళ్లి మ‌రీ.. అక్క‌డి విశేషాల‌ను రామోజీరావు.. వివ‌రించారు. ఈ ప్రాజెక్టు 2024 కు పూర్తి కానుంది. మ‌రోవైపు.. డిన్న‌ర్ చేయాల‌ని కోర‌గా.. అమిత్‌షా సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు తెలిసింది. ఇక‌, సుమారు అర‌గంట పాటు .. తెలంగాణ రాజ‌కీయాలు.. ఏపీ ప‌రిస్థితిపైనా ఇరువురూ చ‌ర్చించుకున్నారు.

ఈ సమావేశంలో రాజకీయ అంశాలే ప్రధానంగా చర్చకు వ‌చ్చిన్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని దృఢ సంకల్పంతో ముందుకెళుతున్న బీజేపీ పలు రంగాలకు చెందిన వారితో సన్నిహిత సంబంధాలను పెంచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా అమిత్‌షా భేటీ అయ్యారు.  నోవాటెల్‌ హోటల్‌లో  జూనియర్ ఎన్టీఆర్ తో షా  భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. అమిత్‌షా, జూ.ఎన్టీఆర్‌ భేటీపై రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

‘RRR’లో ఎన్టీఆర్‌ నటనను ప్రశంసించడానికే ఎన్టీఆర్‌ను అమిత్ షా ఆహ్వానించినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే.. ప్ర‌స్తుతం ఏపీలో జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరు రాజ‌కీయంగా బలంగా వినిపిస్తుండ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ప్ర‌చారం చేసేందుకు వ‌స్తార‌నే వాద‌న వినిపిస్తున్న నేప‌థ్యంలో షా.. జూనియ‌ర్‌ల భేటీకి ప్రాధాన్యం ఏర్ప‌డింది.