సోనియాకు ఆజాద్ డబుల్ షాక్

కాలం కంటే శక్తివంతమైనది మరొకటి ఉండదు. తిరుగులేని అధికారాన్ని చెలాయించిన వారు సైతం కాల మహిమతో తర్వాతి కాలంలో ఎదురయ్యే సవాళ్లకు చేష్టలుడిగిపోతారు. అప్పటివరకు వీర విధేయులుగా ఉన్నవారు సైతం ముఖం చాటేస్తుంటారు. ఇదంతా కాలమహిమ అనకుండా ఉండలేం. పదేళ్ల పాటు దేశాన్ని తన కంటిచూపుతో శాసించి.. ‘రిమోట్’ అనే పదానికి అసలుసిసలు అర్థంగా వ్యవహరించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఒకప్పుడు కాంగ్రెస్ తప్పించి మరే పార్టీ కనుచూపు మేరలో లేదన్నట్లుగా ఉన్న పరిస్థితి నుంచి.. ఈ రోజున అత్యంత బేలతనాన్ని మూటకట్టుకొని.. ఇంకెప్పటికైనా పూర్వ వైభవాన్ని ప్రదర్శించగలమా? అన్న పరిస్థితి. ఇదంతా ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని అధినేత్రిగా వ్యవహరిస్తున్న సోనియాగాంధీకి డబుల్ షాక్ తగిలింది. రెండు షాకుల్ని ఆమెకు ఒకే నేత ఇవ్వటం.. అతగాడు ఆమె ప్రత్యేక టీంలో కీలకభూమిక పోషించిన నేత కావటమే. అవును.. పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్ తాజాగా ఆమెకు దిమ్మ తిరిగే షాకిచ్చారు.

ఆయన్నుజమ్ముకశ్మీర్ లో పార్టీప్రచార కమిటీ సారథిగానియమిస్తూ తీసుకున్ననిర్ణయాన్ని ఆయన విభేదించారు. ఆ బాధ్యత తీసుకునేందుకు నిరాకరించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం ఆయన రాజీనామా చేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యనే ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగియటం.. దాన్ని కొనసాగించేందుకు సోనియాగాంధీ ఆసక్తి చూపించకపోవటంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయనకు జమ్ముకశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో ఆ బాధ్యతను ఆయనకు అప్పగించింది. అయితే.. దీన్ని అజాద్..డిమోషన్ గా భావించినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే తాను అఖిల భారత రాజకీయ వ్యవహారాల కమిటీలో ఉంటే.. దానికి బదులుగా తన పరిధిని తగ్గిస్తూ.. జమ్మూ కశ్మీర్ కు పరిమితం చేయాలని ఆయన జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు తనకు సన్నిహితంగా ఉండే గులామ్ అహ్మద్ మిర్ ను రాష్ట్ర పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించటం పైనా గుర్రుగా ఉన్నారు. ఇలా ఒకటి తర్వాత ఒకటి చొప్పున తనకు ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన ‘రాజీనామా’ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. తాజా పరిణామం సోనియాగాంధీకి ఇబ్బందిని కలిగించేదిగా చెబుతున్నారు. మరి.. దీనిపై సోనియాగాంధీ ఏరీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.