జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై వైఎస్ అభిమానుల ఆగ్ర‌హం

jagan

వైసీపీ గ్రాఫ్ దిగ‌జారుతోందా..? ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాలే కాదు.. ముఖ్య‌మంత్రిగా.. సీఎం జ‌గ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు కూడా దీనికి కార‌ణం అవుతున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. గ‌త వారం రోజుల్లో సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు.. అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల ప్ర‌సంగంలో.. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత ఆశ్చ‌ర్యానికి గురి చేశాయని.. మేధావులు సైతం చెబుతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమం అనేవే లేవ‌ని.. తాము వ‌చ్చిన త‌ర్వాతే.. అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని.. అందుకే ప్ర‌జ‌లు సుఖంగా ఉన్నార‌ని.. సీఎం జ‌గ‌న్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌ల్లో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్య‌లు.. విస్మ‌యానికి గురి చేశాయ‌ని అంటున్నారు. ఎందుకంటే.. సీఎం జ‌గ‌న్ కు ముందు… త‌ర్వాత‌.. కూడా ప్ర‌జ‌లు ఉన్నారు. అప్ప‌ట్లో అనేక ప్ర‌భుత్వాలు.. ప‌లు సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేశాయి. పేద‌ల‌కు రూ.2 కే బియ్యాన్ని తీసుకువ‌చ్చాయి.

ముఖ్యంగా గ‌రీబీ హ‌టావో నినాదం కావొచ్చు.. ఆహార భ‌ద్ర‌త‌, ఉపాధి హామీ వంటి ప‌థ‌కాలు కావొచ్చు.. మహిళ‌ల‌కు ఆస్తిలో హ‌క్కు కావొచ్చు.. ఇలా.. అనేక ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యాయి. ఇవేవీ.. ప్ర‌జ‌ల‌కు తెలియ‌వ‌న్న‌ట్టుగా.. ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని మేధావులు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. అదేస‌మ‌యంలో ప‌రిశ్ర‌మ‌ల ప‌రంగాను.. పారిశ్రామికంగా.. రాష్ట్రం పురోగ‌తి సాధించ‌డం లోనూ.. తాను వ‌చ్చిన త‌ర్వాతే అడుగులు ప‌డుతున్నాయ‌ని జ‌గ‌న్ తాజాగా వ్యాఖ్యానించ‌డంపైనా.. విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.

గ‌తంలో అమెరికాఅధ్య‌క్షుల‌ను ఏపీకి తీసుకువ‌చ్చిన ఘ‌న‌త‌.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డితో పాటు..చంద్ర‌బాబుకు కూడా ద‌క్కుతుంది. అదేవిధంగా అనేక మంది పారిశ్రామిక వేత్త‌ల‌ను కూడా వారు ఏపీకి ర‌ప్పించారు. అస‌లు సెజ్‌ అనే విధానానికి జ‌గ‌న్ తండ్రి వైఎస్ బీజం వేశారు. మ‌రి.. ఇన్ని చేసిన వారిని విస్మ‌రించడం.. అంతా త‌నే చేస్తున్నాన‌ని చెప్పుకోవ‌డం ద్వారా.. ఇప్పుడు.. తండ్రి చేసిన‌.. మేలును కూడా విస్మ‌రిస్తున్నారా? అనేది ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం.

తాను చేసింది చెప్పుకోవ‌డం జ‌గ‌న్‌కు త‌ప్పుకాకున్నా.. అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఏపీని అభివృద్ధి చేయ‌లేద‌ని చెప్ప‌డం ద్వారా.. త‌న తండ్రిని కూడా జ‌గ‌న్ అవ‌మానిస్తున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చంద్ర‌బాబుపై కోపంతోనో.. రాజకీయ ల‌బ్ధి కోస‌మో.. చేస్తున్న‌వ్యాఖ్య‌లు.. వివాదానికి.. వైఎస్‌ను అవ‌మానించేందుకు దారితీస్తున్నాయ‌ని అంటున్నారు.