మమత వెంటపడుతున్న కేంద్రం

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని ఎలా బలహీనం చేయాలనే విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్ధలు వెంటపడుతున్నట్లు అనుమానంగా ఉంది. తాజాగా సీఎంకు అత్యంత సన్నిహితుడైన అనుబ్రత్ మండల్ ను సీబీఐ అరెస్టుచేసింది. 2020లో నమోదైన పశువుల అక్రమరవాణా కేసులో మండల్ ను సీబీఐ ఆయనింట్లోనే అరెస్టుచేసింది. పశువుల స్మగ్లర్లనుండి డబ్బులు తీసుకుని వారికి రక్షణ కల్పిస్తున్నట్లు అభియోగాలున్నట్లు దర్యాప్తుసంస్ధ చెప్పింది.

ఈమధ్యనే భారీ పరిశ్రమలశాఖ మంత్రి పార్ధాచటర్జీని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టుచేసిన విషయం తెలిసిందే. ఒకవైపేమో ఏవో కేసులున్నాయన్న కారణంగా కేంద్ర దర్యాప్తు సంస్ధలు మమతకు సన్నిహతుల్లో ఒక్కొక్కరిని అరెస్టులు చేస్తోంది. ఇదే సమయంలో డిసెంబర్లోపు మమత ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బహిరంగంగానే బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి హెచ్చరిస్తున్నారు.

దర్యాప్తుసంస్ధలను అడ్డంపెట్టుకుని తననను కేంద్రప్రభుత్వం వేధిస్తోందంటు నరేంద్రమోడీపై మమత మండిపోతున్నారు. మోడీని వ్యతిరేకించేవాళ్ళని, కేంద్రంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వాళ్ళల్లో ఎవరినీ మోడీ విడిచిపెట్టడంలేదని కాంగ్రెస్ నేతలు కూడా చాలామంది గోలచేస్తున్నారు. అరెస్టవుతున్న వారిపైన ఉన్న కేసుల సంగతి ఎలాగున్నా వివిద రాష్ట్రాల్లో వరుసగా అరెస్టవుతున్న ప్రతిపక్ష నేతల అరెస్టుల విధానాలను చూసిన తర్వాత కక్షసాధింపని అనుకునేందుకు అవకాశాలైతే ఉన్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బ్యాంకుల్లో వేలకోట్లరూపాయల అప్పులు తీసుకుని ఎగొట్టిన వాళ్ళు ఎంపీలుగా, మాజీ ఎంపీలుగా తిరుగుతున్నవారు బీజేపీలోనే ఉన్నారు. సుజనాచౌదరి, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్, రఘురామకృష్ణంరాజు లాంటి వాళ్ళు అనేకమందిపై సీబీఐ, ఈడీ, ఐటి కేసులునమోదుచేసి విచారణ కూడా పూర్తిచేశాయి. వీళ్ళంతా కోట్లాదిరూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టినట్లు సీబీఐ దర్యాప్తులో తేలినా ఎందుకు అరెస్టులు చేయటంలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అభియోగాలను ఎదుర్కొంటున్న అందరినీ దర్యాప్తు సంస్ధలు అరెస్టులు చేస్తే వేధింపుల ఆరోపణలుండవు. ప్రతిపక్షాల్లో ఉన్న పై నేతలు బీజేపీలో చేరగానే సచ్చీలురైపోయారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి ఉదాహరణలు చూసినపుడే కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాల నేతలను వేధిస్తున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి.