జోరు పెంచుతున్న మాజీ ముఖ్యమంత్రుల వారసులు

వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు మాజీ ముఖ్యమంత్రుల వారసులు జోరు పెంచబోతున్నారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి వారసులు దాదాపు ఎనిమిది మంది తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్టీయార్, నాదెండ్ల భాస్కరరావు, వైఎస్సార్, చంద్రబాబు నాయుడు వారసులు ఎనిమిది మంది వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయింది. వీరిలో కొందరు మొన్నటి ఎన్నికల్లో కూడా పోటీ చేసినా చతికిలపడిపోయారు.

కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు, ఎంఎల్ఏ కాసు మహేష్ రెడ్డి గురజాల నుండి రెండోసారి పోటీ చేయబోతున్నారు. అలాగే కోట్ల విజయభాస్కరరెడ్డి వారసులుగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు ఎంపీగా, భార్య సుజాతమ్మ ఎంఎల్ఏగా పోటీ చేయబోతున్నారు. వీరిద్దరు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.  ఎన్టీఆర్ కొడుకు, ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ హిందూపురం రెండోసారి పోటీచేయబోతున్నారు. ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా ఎక్కడి నుండి పోటీ చేస్తారో తెలీదు. మొన్నటి ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా ఓడిపోయారు.

చంద్రబాబు నాయుడు కొడుకు, మాజీ మంత్రి నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేయటం దాదాపు ఖాయమే. ఈయన మొన్నటి ఎన్నికల్లో ఇక్కడినుండే పోటీ చేసి ఓడిపోయారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పులివెందుల నుండే పోటీచేస్తారు. నాదెండ్ల భాస్కరరావు కొడుకు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ తరపున తెనాలిలో పోటీచేయటం దాదాపు ఖాయమైంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే.

చాలామంది తమ తాతలు, తండ్రుల వారసులుగానే రాజకీయాల్లోకి వచ్చినా నిలదొక్కుక్కున్నది మాత్రం తక్కువమందనే చెప్పాలి. జనాల్లో రెగ్యులర్ గా ఉండకపోవటం, తాతలు, తండ్రుల నుండి వచ్చిన వారసత్వాన్ని నిలుపుకోలేకపోవటం, రాజకీయాల్లో ఆసక్తి లేకపోవటమనే కారణాలతో మరికొందరు తెరమరుగైపోయారు. నీలం సంజీవరెడ్డి, దామోదర్ సంజీవయ్య, టంగుటూరి ప్రకాశంపంతులు, భవనం వెంకట్రామ్ వారసులు ఇపుడు ఎక్కడున్నారు ? ఏమిచేస్తున్నారో కూడా చాలా మందికి తెలీదు.