కేసీఆర్ కు మోడీ రివర్స్ షాక్

‘దేశంలో మిగిలిన పార్టీలన్నింటినీ మింగేసి ఏక పార్టీ స్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ కుట్రలు చేస్తోంది’.. ఇది తాజాగా నరేంద్రమోడీపై కేసీఆర్ వెళ్ళ గక్కిన అక్కసు. అంటే టీఆర్ఎస్ నుంచి నేతలు, ప్రజాప్రతినిధులను లాగేసుకోవటం ద్వారా కేసీఆర్ బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఆయన మాటల్లోనే అర్ధమైపోతోంది. బీజేపీ చేస్తున్నదంతా అప్రజాస్వామిక విధానాలేనంటు మీడియా సమావేశంలో మండిపోయారు. 

నిజమే ఒక పార్టీ తరపున గెలిచిన ఎంఎల్ఏలు, ఎంపీలను మరో పార్టీ లాగేసుకోవటం అప్రజాస్వామిక విధానాలే అనటంలో సందేహం లేదు. మరి 2014లో అధికారంలోకి రాగానే కేసీఆర్ చేసిందేమిటి ? అప్పటి ఎన్నికల్లో కేసీఆర్ సింపుల్ మెజారిటితో మాత్రమే అధికారంలోకి వచ్చారు. ఏ కారణంతో అయినా తన ప్రభుత్వం కూలిపోయే ప్రమాదముందని గ్రహించిన కేసీఆర్ ఏమి చేశారు ? టీడీపీ, కాంగ్రెస్ తరపున గెలిచిన ఎంఎల్ఏల మీద దృష్టిపెట్టారు. 

పై రెండు పార్టీల తరపున గెలిచిన ఎంఎల్ఏలపై ఏదోరకంగా ఒత్తిళ్ళు తెచ్చి లేదా ప్రలోభాలకు గురిచేసి టీఆర్ఎస్ లోకి లాగేసుకున్నారు. తెలంగాణాలో టీఆర్ఎస్ తప్ప మరో పార్టీ బతక్కూడదన్న పద్దతిలో రాజకీయం చేశారు. కేసీఆర్ దెబ్బకే టీడీపీ నామరూపాలు లేకుండా భూస్ధాపితమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏదో అలా అలా నెట్టుకొస్తోంది. ఈ రెండు పార్టీలను లేకుండా చేస్తే తెలంగాణాలో తనకు ఎదురే ఉండదని పిచ్చి ఆలోచన చేశారు. కేసీఆర్ ఆలోచన కొంతవరకు సక్సెస్ అయ్యింది కానీ ఊహించని రీతిలో  బీజేపీ పుంజుకుంది. 

ఈరోజు బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు, మూడు ఎంఎల్ఏ సీట్లు రావటానికి కేసీయార్ పనికిమాలిన ఆలోచనే కారణం. కాంగ్రెస్, టీడీపీలు లేకపోవటంతో టీఆర్ఎస్ కు ఓట్లేయటానికి ఇష్టపడని జనాలు వేరే దారిలేక బీజేపీకి ఓట్లేయటం మొదలుపెట్టారు. కేసీయార్ గనుక కాంగ్రెస్, టీడీపీల జోలికి వెళ్ళకుండా ఉంటే జనాలు బీజేపీని పట్టించుకునేవారు కాదేమో. అంటే తాను చేస్తేనేమో పూర్తి ప్రజాస్వామ్యం. తాను చేసిన పనులే ఇపుడు బీజేపీ చేస్తుంటే అప్రజాస్వామ్యం అనుకుంటే నష్టాలు ఇలాగే ఉంటాయి. ప్రకృతిలాగే ప్రజాస్వామ్యం కూడా ఎప్పటికపుడు తనను తాను దిద్దుకుంటుంది అనే విషయం గ్రహించాలి.